మంగళవారం పైదరాబాద్లో గవర్నర్ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు నాటి ఘర్షణలు సృష్టించిన ఉద్రిక్తత చల్లారనంటోంది. ఆరోపణలూ, ప్రత్యారోపణలే కాకుండా ప్రదర్శనలూ, పోలీసు స్టేషన్ల ముందు ధర్నాలు జరుగుతున్నాయి. అంతటితో కూడా ఆగడం లేదు. ప్రతిపక్షనాయకుడు వెళ్లి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన దగ్గర్నుంచీ వైసిపి ఏది కోరితే అదే జరుగుతోంది. చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి కేంద్ర ఎన్నికల కమిషన్కు ఎన్ని మహాజరులిచ్చినా చెవినపెట్టిన వారు లేరు. ఆ కారణంగానే ప్రస్తుతం నెలకొంటున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించాల్సివస్తోంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి ఏం కోరుకుంటున్నదన్నది ప్రధాన ప్రశ్న. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. అది ఏదో చేయాలి కాబట్టి చేసిన డిమాండా లేక నిజంగానే వైసిపి అదే కోరుకుంటోందా? ఆ తరుణంలో రాష్ట్రపతి పాలన విధిస్తే దానివల్ల అంధ్రప్రదేశ్లో బిజెపికి ఎలాంటి లాభం ఉండదు సరికదా ఇంకా ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో ఎంతోకొంత నష్టం ఉంటుంది. చంద్రబాబు నానాయాగీ చేయగలరు. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలలో ప్రచారానికి వెళ్లి మోదీ సర్కారును ఎండగట్టగలరు. దానిని భరించాల్సిన అవసరం ఏముంది?
నిజానికి పోలింగ్ ముగిసిపోయి అభ్యర్ధుల జాతకాలు ఇవిఎంలలో నిక్షిప్తం అయిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకునే పరిణామాలు ఎవరి భవితవ్యాన్నీ మార్చేది లేదు. ఇక్కడ పోలింగ్ ముగియగానే, అవకతవకలు జరిగాయంటూ ఎన్నికల కమిషన్ తీరును ఎండగడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. 50 శాతం వివిప్యాట్లు లెక్క పెట్టాలని కోరుతూ మళ్లీ ప్రతిపక్షాలను కూడగట్టారు. తాను ప్రచారానికి వెళ్లిన రాష్ట్రాలలో కూడా ఎన్నికల కమిషన్ బిజెపి ఆదేశాలను పాటిస్తోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు భిన్నంగా వైసిపి రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించారంటూ ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది. ఈ నేపధ్యంలో చంద్రబాబు ప్రస్తుత రాజకీయాలకు ప్రతిగా వైసిపి శాంతిభద్రతల వివాదం మొదలుపెట్టిందనుకోవచ్చా!