విజయవాడ, ఏప్రిల్ 3: ఈ ఎన్నికల్లో ప్రజలు అందరూ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఎసి వేసుకోవాలని (వైసిపిని ఓడించాలని) ప్రకటించిన దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ శత్రుపీడ, సంకల్పసిద్ధి, రాష్ట్ర సంక్షేమం కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మారు అధికారంలోకి రావాలని కోరుతూ యాగాన్ని చేపట్టారు.
విజయవాడలో కెజే గుప్తా కల్యాణ మండపంలో వంగవీటి రాధాకృష్ణ సోదరి ఆశా, ఆమె భర్తతో కలిసి మూడు రోజుల పాటు నిర్వహించే యాగాన్ని ఆదివారం రుత్వికుల ఆధ్వర్యంలో ప్రారంభించగా, బుధవారం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు.
వైసిపి నుండి టిడిపిలో చేరిన వంగవీటి రాధాకృష్ణ టిడిపి స్టార్ క్యాంపేయినర్గా వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల కాలంలో రాజకీయ పార్టీల నేతలు హోమాలు, పూజలను ఎక్కువగా నమ్ముతున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు రాజశ్యామల యాగం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కెసిఆర్ ఘన విజయం సాధించడానికి యాగమే కారణమని కూడా ప్రచారం జరిగింది. ఈ కారణంగా ఎపిలోనూ వివిధ పార్టీల నాయకులు హోమాలు, యాగాలు ముమ్మరంగా చేస్తున్నారు. గత నెలలో వైసిపి అధినేత జగన్ సైతం రాజశ్యామల యాగం నిర్వహించారనీ, అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని తెలుస్తోంది.
వీడియో కోసం కింద క్లిక్ చేయండి
వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో యాగం