విజయవాడ, జనవరి 22: దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధకృష్ణ ఈ నెల 25వతేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. రెండు రోజుల క్రితమే రాధాకృష్ణ వైసిపికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి పంపారు.
తన భవిష్యత్తు కార్యాచరణపై రాధా – రంగా మిత్రమండలి సభ్యులు, తన సన్నిహితులతో రాధా సంప్రదింపులు జరిపారు. పలువురు వైకాపా కార్పోరేట్లు సైతం ఆయనకు మద్దతుగా నిలిచి వైసిపికి రాజీనామాలు చేశారు. టిడిపిలో చేరడమే మంచిదనే అభిప్రాయానికి వారు వచ్చినట్లు తెలుస్తుంది.
రాధా టిడిపిలో చేరికకు సిఎం చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.
సోమవారం రాత్రి క్యాబినెట్ సమావేశం ముగిసిన తరువాత కృష్ణాజిల్లా నేతలతో చంద్రబాబు సమావేశమైయ్యారు. రాధా చేరికపై చర్చించి రాధాను కలుపుకుని వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించినట్లు సమాచారం. పార్టీ ప్రయోజనాల దృష్యా రాధాను పార్టీలోకి ఆహ్వనిస్తున్నట్లు చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తుంది. రాధాకు ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతొంది.