అమరావతి: నాలుగు వారాలు ఓపిక పడితే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరాచకాలు బయటపడతాయని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఉమామహేశ్వరరావుపై విజయసాయిరెడ్డి శుక్రవారం ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
‘మరో నాలుగు వారాలు ఓపిక పట్టు ఉమా. ఇరిగేషన్ శాఖలో ఐదేళ్లుగా నువ్వు సాగించిన అరాచకం అంతా బయటకొస్తుంది. అధికారులు, బాధితులైన కాంట్రాక్లర్లు నీ దోపిడీ వ్యవహారాల ఫైళ్లను స్వచ్ఛందంగా తెచ్చి ఇస్తున్నారు. పోలవరం, హంద్రీ-నీవాల్లో రెండేళ్లలోనే వందల రెట్లు అంచనాలు పెంచింది నిజం కాదా?’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
మరో ట్వీట్లో టిటిపి అనుకూల మీడియాపై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ‘ప్రపంచ ఆర్థిక సదస్సుకు దావోస్ వెళ్లిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి విడిది కోసం 1.8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని పచ్చ మీడియా గగ్గోలు పెడుతోంది. ఆహ్వానం లేకున్నా బాబు, ఆయన కుమారుడు నాలుగు సార్లు ప్రత్యేక విమానాల్లో వెళ్లి ప్రజలపై 100 కోట్ల రూపాయల భారం మోపారని ఎందుకు ప్రస్తావించరు?’ అని విజయసాయిరెడ్డి నిలదీశారు.
చంద్రబాబు ఇప్పటివరకూ మూడు సార్లు దావోస్ వెళ్లి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. ఈ ఏడాది మాత్రం గణతంత్ర వేడుకలు, ఇతర సమావేశాల నేపథ్యంలో తన పర్యటనను రద్దు చేసుకుని ఆ బాధ్యతలను మంత్రి నారా లోకేష్కు అప్పగించారు.