అమరావతి: ఏపీ శాసనమండలి చైర్మన్ టీడీపీ కార్యకర్తలా పని చేశారని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడం వల్ల ఏ ప్రయోజనం ఉండదన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో శాసనసభే సుప్రీమ్ అని చెప్పారు. శాసనమండలి చైర్మన్ షరీఫ్ ను చంద్రబాబు ప్రభావితం చేసి తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని ఆరోపించారు. మండలి గ్యాలరీలో కూర్చుని ఓ కార్యకర్త కంటే హీనంగా చంద్రబాబు వ్యవహరించారని దుయ్యబట్టారు.
మండలి రద్దును ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో ఇటీవల చర్చ జరిగిందని, కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని వర్గాల సలహాలు తీసుకుంటే మంచిదని భావించి సమయం ఇచ్చామని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్సీలను కొనుగోలు చేసి తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నామన్న ఆరోపణలను సజ్జల ఖండించారు. టీడీపీ ఎమ్మెల్సీలను కొనుగోలు చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేయాల్సిన అవసరం సీఎం జగన్కు లేదని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకును ఓడించి.. తమను గెలిపించిన ప్రాంతాన్ని ఎలా వదిలేస్తామని ప్రశ్నించారు. అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
సీఎం జగన్ నవతరం నాయకుడైతే.. చంద్రబాబు నాయుడు అంతరించిపోతున్న నాయకుడని సజ్జల వ్యాఖ్యానించారు. 151 మంది ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ప్రజా సంక్షేమ పథకాలు చేపడుతున్నారని తెలిపారు. అయితే మండలిలో ఉన్న మెజార్టీతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతోందని ఆరోపించారు. ప్రజల సంపూర్ణ మద్దతు, తీర్పు తమవైపే ఉందని సజ్జల చెప్పారు.