అమరావతి: తన వరకూ వస్తే గానీ బాధ ఏమిటో చంద్రబాబుకు తెలియలేదని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. దొంగే దొంగ అని అరవడం చంద్రబాబుకు 40 ఏళ్లుగా అలవాటైపోయిందని విజయసాయిరెడ్డి విమర్శించారు. వైసిపి మహిళా నేతలను అత్యంత నీచమైన భాషతో గతంలో తిట్టించింది చంద్రబాబేననీ, ఇవ్వాళ తనే బాధితుడినన్నట్లు కుల మీడియాలో శోకాలు పెడుతున్నారనీ విజయసాయిరెడ్డి అన్నారు. తన వరకు వస్తే గానీ బాధేమిటో తెలియలేదని విజయసాయి పేర్కొన్నారు.
1982 నుండి లేనిది ఉన్నట్లు రాస్తూ ప్రజలను మభ్యపెట్టిన పచ్చమీడియా అడ్రసు గల్లంతవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుందనీ అందుకే సోషల్ మీడియా పోస్టింగ్లపై మీడియా సమావేశం పెట్టి తన స్థాయిని చంద్రబాబు దిగజార్చుకున్నాడనీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో 600 కేసులు పెట్టి వేధించిన సంగతి ఎవరూ మర్చిపోలేదని విజయసాయిరెడ్డి అన్నారు.
అమరావతి ప్రపంచ స్థాయి సిటీ, రెండో టోక్యో అవుతుందని మొన్నటి దాకా చంద్రబాబు ప్రజెంటేషన్లతో చావగొట్టారనీ, ఇప్పుడేమో సోషల్ మీడియాలో దుర్భాషలాడుతున్నారని ఎవరూ పట్టించుకోని పోస్టులను అందరికీ చూపించారనీ విజయసాయిరెడ్డి విమర్శించారు. తన చర్యల కారణంగా పాతాళంలోకి జారి పోయాడనీ, ఎన్ని జాకీలు పెట్టినా పచ్చ మీడియా బయటకు లాగలేదనీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.