YS Jagan : ఎన్నికలు ఆగేలా నిమ్మగడ్డపై సీఎం జగన్ YS Jagan అతిపెద్ద అస్త్రం వేయబోతున్నారు. ఇదేంటి.. ఓపక్క పంచాయతీ ఎన్నికలు జరిగిపోతున్నాయి.. ఇప్పటికే మొదటి దశ నామినేషన్ల దాఖలు కూడా జరిగిపోయింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికలు జరిగే జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేసేస్తున్నారు.. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఆదేశాలిస్తున్నారు.. ఎన్నికల కమిషనర్ కు ప్రభుత్వానికి మధ్య లేఖల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఓపక్క గ్రామాల్లో నామినేషన్లు వేస్తే.. మరోపక్క ఏకగ్రీవాలు జరిగిపోతున్నాయి.. ఇంత హడావిడి జరిగిపోతుంటే.. ఇంకా ఎన్నికలు ఆగేలా సీఎం జగన్ ప్లాన్ ఏంటి..? అనేకదా..! అక్కడికే వస్తున్నాం.. పంచాయతీ ఎన్నికలు ఈనెల 21తో ముగుస్తాయి. వెనువంటనే మరో మూడు నాలుగు రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవ్వాలన్న నిమ్మగడ్డ ఆలోచనకు బ్రేక్ వేసేందుకే సీఎం జగన్ వద్ద ఉన్న అస్త్రం.
నిమ్మగడ్డ లక్ష్యం.. మరొకటి..
ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ పదవీకాలం ఈ ఏడాది మార్చి 31న ముగుస్తోంది. అప్పటిలోగా ఎన్నికలు నిర్వహించాలనేది ఆయన పెట్టుకున్న లక్ష్యం. ఇందులో భాగంగానే పంచాయతీ ఎన్నికలపై ఏపీలో జరిగిన పంచాయితీ చూశాం. వాగ్వాదాలు, విమర్శలు, ఎత్తుకు పైఎత్తులు అనంతరం ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ వెళ్లాయి. అంతిమంగా ఎన్నికల కమిషన్ విజయం సాధించింది. దీంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు పంచాయతీ ఎన్నికల గుర్రం కళ్లాన్ని అదిలిస్తూ దూసుకెళ్తున్నారు. అయితే.. ఆయన మదిలో పంచాయతీ మాత్రమే కాదు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఆలోచన కూడా ఉంది. ఇప్పటికే ఉప్పు, నిప్పులా ఉన్న ఏపీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ (జగన్ వర్సెస్ నిమ్మగడ్డ) వ్యవహారం మరింత రాజుకోనుంది. ఇదే జరిగితే ఈ రెండు నెలలు ఏపీలో ఎన్నికల జాతరే జరుగుతుంది. అయితే.. వీటిని మాత్రం ఖచ్చితంగా ఆపాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఎలాగంటే..
ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఊరుకుంటారా..?
నిజానికి 2020 మార్చిలో పంచాయతీ ఎన్నికల రద్దుకు ముందే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఆ ప్రకారం ప్రయత్నాలు కూడా జరిగిపోయాయి. ఇదే తడవుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవుల కోసం అభ్యర్ధులు సిద్ధమైపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీలు 20 నుంచి 30 శాతం, జడ్పీటీసీలు 30 శాతం వరకూ ఏకగ్రీవాలు అయిపోయాయి. అంటే.. రాజ్యాంగం ప్రకారం, ఎన్నికల నియమావళి ప్రకారం వీరందరూ ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా ఎన్నికైపోయారు. అయితే.. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రద్దైపోయింది. తర్వాత కరోనా పరిస్థితుల నేపథ్యంలో నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు నిమ్మగడ్డ ఆలోచన ప్రకారం పంచాయతీ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. అదే జరిగితే ఏకగ్రీవాలతో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఊరుకుంటారా..? ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు. రాజ్యాంగం ప్రకారం ఏకగ్రీవాలుగా ఎన్నికైన అభ్యర్ధులను రద్దు చేసే అవకాశం లేదు. ఇదే ఇప్పుడు సీఎం జగన్ కు వరంలా మారింది.
జగన్ కు ఇదే బలం కానుందా..?
ఈ అస్త్రాన్ని ఉపయోగించి ప్రభుత్వం కూడా కోర్టుకు వెళ్తే నిమ్మగడ్డ ఆశలపై నీళ్లు జల్లినట్టే. ఎందుకంటే.. ఈనెల చివరి వారంలో నోటిఫికేషన్ వస్తే.. ఎన్నికలు నిర్వహణకు నిమ్మగడ్డకు ఎన్నికల కమిషనర్ గా ఉండే పదవీకాలం కేవలం నెల మాత్రమే. ఈ నెల రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలు కోర్టుకు వెళ్తే కనీసం విచారణకు వారం సమయం పడుతుంది. ఇక్కడ ఎవరు ఓడిపోయినా.. వారు సుప్రీంకోర్టుకు ఖచ్చితంగా వెళ్తారు. అక్కడ కూడా వాయిదా, అఫిడవిట్లతో మరో వారం పది రోజులు పడుతుంది. మొత్తంగా తుది తీర్పు వచ్చే సమయానికి నిమ్మగడ్డ పదవీకాలానికి మహా అయితే.. మూడు వారాల సమయం ఉంటుంది. ఇంత తక్కువ టైమ్ నిమ్మగడ్డకు సరిపోదు. అసలు.. అన్నీ సవ్యంగా జరిగితే కోర్టు తీర్పు ఎంపీటీసీ, జడ్జీటీసీలకు అనుకూలంగా వస్తే.. ఎన్నికలు జరిగే అవకాశమే ఉండదు. గత నోటిఫికేషన్ ప్రకారమే వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు సీఎం జగన్ కు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డపై పైచేయి సాధించడం నల్లేరుపై నడకే. అయితే.. అంచనాలకు అందని విధంగా వెళ్తున్న నిమ్మగడ్డ ఆ ఎన్నికలకు ఏ వ్యూహం అమలు చేస్తారో.. ఎలా ముందుకెళ్తారో తెలియాలంటే మరో మూడు వారాలు ఆగాల్సిందే.