`నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` పరాజయం తర్వాత దాదాపు ఏడాది పాటు ఏ సినిమాకు అల్లు అర్జున్ ఓకే చెప్పలేదు. చాలా కథలు విన్నా.. చివరకు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికే ఓటేశాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు సక్సెస్ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఆ సినిమాయే `అల..వైకుంఠపురములో`. భారీ బడ్జెట్.. భారీ తారాగణంతో రూపొందిన అల..వైకుంఠపురములో ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే ముందుగా సినిమా కథలోకి వెళదాం…
సెన్సార్: యు/ఎ
వ్యవథి: 164 నిమిషాలు
సమర్పణ: శ్రీమతి మమత
బ్యానర్స్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్
నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, జయరాం, మురళీశర్మ, సుశాంత్, నివేదా పేతురాజ్, సునీల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, వెన్నెలకిషోర్, బ్రహ్మాజీ, రావు రమేష్, బ్రహ్మానందం, అజయ్ తదితరులు
సంగీతం: ఎస్.ఎస్.తమన్
కెమెరా: పి.ఎస్.వినోద్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ(చినబాబు)
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్
కథ:
వాల్మీకి(మురళీశర్మ), రామచంద్ర(జయరాం) ఒకేసారి కెరీర్ను స్టార్ట్ చేస్తారు. అయితే రామచంద్ర తన సమర్ధతతో ఏఆర్కే కంపెనీ అధినేత(సచిన్ ఖేడేకర్)ను మెప్పించి ఆయన కూతురు ఈషు(టబు)ని పెళ్లి చేసుకుని కంపెనీ అధినేతగా ఎదుగుతాడు. దాంతో వాల్మీకికి రామచంద్రపై తెలియని ద్వేషం ఏర్పడుతుంది. దాంతో తన పుట్టిన కొడుకుని ఆయన కొడుకు స్థానంలోకి, తన కొడుకు స్థానంలోకి ఆయన కొడుకుని మార్చేస్తాడు. వాల్మీకి కొడుకుగా పేరిగిన బంటు(అల్లుఅర్జున్) చాలా చురుకుగా ఉంటాడు. అయినా కూడా వాల్మీకి అతన్ని మాటమాటకీ దెప్పిపొడుస్తూనే ఉంటాడు. రామచంద్ర కొడుకుగా పెరిగిన రాజ్ మనోహర్(సుశాంత్) నెమ్మదిగా ఉంటుంటాడు. బంటు తన చురుకుదనంతో అమూల్య(పూజాహెగ్డే) కంపెనీలో స్థానం సంపాదించడమే కాకుండా.. ఆమె ప్రేమను కూడా గెలుచుకుంటాడు. అయితే రాజ్మనోహర్తో అమూల్య నిశ్చితార్థం జరుగుతుంది. ఓ ప్రమాదంలో రామచంద్రను కాపాడిన బంటుకి తనే ఆయన కొడుకు అనే నిజం తెలుస్తుంది. అప్పుడు బంటు ఏం చేస్తాడు. తన తల్లిదండ్రులను ఎలా చేరుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ:
దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనదైన స్టైల్లో స్టైలిష్గా కనపడ్డాడు. యాక్షన్ సీన్స్లో అద్భుతంగా నటించాడు. ఇక డాన్సుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా అంతటినీ చక్కగా పుల్ చేశాడు. సెటిల్డ్ పెర్ఫామెన్స్ చేస్తూనే వీలున్న చోటల్లా కామెడీని పండించాడు. పూజా హెగ్డే ట్రావెల్ కంపెనీ యజమానురాలుగా చక్కగా నటించింది. గ్లామర్గా కనపడింది. పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. జయరాం, టబు భార్యభర్తలుగా నటించారు. వీరిద్దరి పాత్రల్లో హుందాగా నటించారు. సుమద్రఖని, అజయ్.. సింపుల్ విలనిజాన్ని చక్కగా ఆవిష్కరించారు. ముఖ్యంగా సెకండాఫ్లో తన విలనిజాన్ని త్రివిక్రమ్ తెరపై చూపించిన విధానం బావుంది.మురళీశర్మ..చక్కటి పాత్ర… సినిమా కథకు తనే మూలంగా ఉంటాడు. ఈ పాత్రను చక్కటి హావభావాలతో మురళీశర్మ తెరపై ఆవిష్కరించాడు. సునీల్, హర్షవర్ధన్, నవదీప్, రాహుల్ రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, సచిన్ ఖేడేకర్, రోహిణి, బ్రహ్మాజీ తదితరులు వారి వారి పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.
దర్శకుడు… త్రివిక్రమ్ ఎప్పటిలాగానే సినిమాను కూల్గా చిత్రీకరించారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తెరపై ఆవిష్కరించారు. ఎమోషనల్ సీన్స్ను, కామెడీ సీన్స్ను చక్కగా ఎలివేట్ చేశారు. సందర్భానుసారం మంచి డైలాగ్స్ రాశారు. అలాగే సన్నివేశాలను రిచ్గా చిత్రీకరించారు. క్లైమాక్స్ను ఏదో భారీగా చిత్రీకరించాలని కాకుండా శ్రీకాకుళం యాసలో సాగే పాటతోనే ముగించేశారు. ఓ పాత కథను తీసుకుని దానికి హంగులు మార్చి తనదైన స్టైల్లో తెరకెక్కించాడు. ఈ సినిమాకు మ్యూజిక్ ప్రధాన భూమికను పోషించింది. సామజవరగమన, రాములో రాముల, బుట్ట బొమ్మ సాంగ్తో పాటు క్లైమాక్స్ ఫైట్గా వచ్చే శ్రీకాకుళం యాసలో సాగే పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం బావుంది. పి.ఎస్.వినోద్ ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. స్టైల్గా, రిచ్గా చూపించాడు.
పాత కథ.. కథలో ఎలాంటి ట్విస్టులు ఉండవు. సినిమా నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. సెకండాఫ్లో వచ్చే సాంగ్స్ సీన్.. బాగానే ఉన్నా… కాస్త ఓవర్గా ఉన్నట్లు ఆ సీన్కు హీరో ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నాడో అనిపిస్తుంది. అయితే ఆ సీన్ను ఆడియెన్స్ కోసం రీ క్రియేట్ చేశారనినిపస్తుంది.
బోటమ్ లైన్:
అల వైకుంఠపురములో… కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
రేటింగ్: 3/5