(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మహిళా ఉద్యోగినితో ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ అసభ్యకరంగా మాట్లాడాడంటూ ఓ ఫోన్ కాల్ రికార్డిండ్ వైరల్ అవుతోన్న నేపథ్యంలో పృథ్వీ స్పందించారు. తాను ఏ ఉద్యోగినితో ఫోన్లో మాట్లాడలేదని..ఆ ఆడియోలో ఉన్న వాయిస్ కూడా తనది కాదన్నారు. తాను ఎస్వీబీసీ చైర్మన్ అవ్వడం చాలామందికి ఇష్టం లేదని, వారే కావాలని ఇటువంటి వివాదాల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఫోన్ కాల్ వివాదంపై విచారణకు సిద్దమేనని పృథ్వీ స్పష్టం చేశారు. తప్పుచేశానని తేలితే ఎటువంటి శిక్ష వేసినా శిరసావహిస్తానన్నారు. మహిళల పట్ల ఎంతో గౌరవంగా మెలుగుతానని, ఆ విషయం ఉద్యోగులకు కూడా తెలుసన్నారు. తనలో ఎటువంటి అసభ్య ప్రవర్తనలు లేవని వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి బెబుతానని పృథ్వీ చెప్పారు.
పృథ్వీరాజ్… ఓ ఉద్యోగినితో జరిపిన సరస సంభాషణ ఆడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం మండిపడింది. ఆదివారం తిరుపతిలో మీడియా సమావేశంలో ఆ సంఘం నేతలు మాట్లాడుతూ… ‘తక్షణం పృథ్వీని ఆ పదవి నుంచి తొలగించాలి. ఇంకెంతమందిని వేధిస్తున్నాడో.. సినిమా పరిశ్రమలో తప్పులు చేయడం వేరు. ఆధ్యాత్మిక సంస్థలో ఇటువంటి పనులు చేయడం తప్పు. ఆయనపై జగన్ చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. పృథ్వీ ఆడియోపై ఇప్పటికే విమర్శలు ఎక్కువవుతున్నాయి. టీటీడీ విజిలెన్స్ కూడా ఫోన్ కాల్ దుమారంపై ఫోకస్ పెట్టింది. త్వరలోనే పృథ్వీని వివరణ అడిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
కాగా, ఎస్వీబీసీ ఛానెల్లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినితో పృధ్వీ ఫోన్లో సాగించిన సంభాషణ ఇప్పుడు కలకలం రేపుతోంది. “నువ్వంటే ఇష్టమని.. తన గుండెల్లో ఉన్నావని..లవ్ యూ” అంటూ ఫోన్లో ఉద్యోగినితో పృధ్వీ మాట్లాడారు. ప్రస్తుతం మద్యం సేవించడం మానేసిన తాను.. మళ్లీ తాగడమంటూ జరిగితే నీవద్దే కూర్చొని తాగుతానంటూ ఆ ఉద్యోగినితో చెప్పారు. అంతే కాదు.. ఏకంగా చానెల్ కార్యాలయంలోనే వెనుక నుంచి వచ్చి పట్టుకుందామని అనుకున్నానని, ఎక్కడ భయపడి అరుస్తావోనని ఆగిపోయానన్నారు.
ఇక పృధ్వీ మాటలకు ఆ ఉద్యోగిని కూడా అలాగే స్పందించింది. నిత్యమూ గుర్తుకు వస్తారని, మీ కోసం వెయిట్ చేశానని చెప్పింది. కిలకిలా నవ్వుతూ మాట్లాడింది. తాను వర్షంలో తడుస్తూ ఇంటికి వచ్చానని, తనను వెనుకనుంచి వచ్చి గట్టిగా పట్టుకున్నా అరవబోనని మాట్లాడింది. ఈ లీకైన ఆడియోను తెలుగు మీడియా చానెళ్లు ప్రముఖంగా ప్రసారం చేశాయి.