(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
విజయవాడ: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై సీనియర్ నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పందించారు. సిఎం జగన్ పిచ్చి నిర్ణయాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. రాజధాని రైతుల పట్ల మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవహేళనగా మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో అన్ని జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. పోలీసులతో ఉద్యమాలను అణచివేయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. మహిళలపై పోలీసులు అయితే దాడి చేయరనీ, యూనిఫామ్ ముసుగులో కొంత మంది అరాచక శక్తులు ప్రవేశించాయేమోనన్న అనుమానం కలుగుతోందనీ వడ్డే అన్నారు.
రాజ్యాంగంలోని 214 అధికరణ ప్రకారం ఒక రాష్ట్రానికి ఒక్కటే హైకోర్టు ఉండాలన్నారు. హైదరాబాదు నుండి అమరావతికి హైకోర్టు మారుస్తున్న సమయంలో రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ ఎందుకు మౌనంగా ఉన్నారనీ అప్పుడే కర్నూలులో పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయలేదని వడ్డే ప్రశ్నించారు.
అమరావతిలో రాజధాని వద్దని తాను మొదటి నుండి చెబుతున్నా నాటి చంద్రబాబు ప్రభుత్వం వినిపించుకోలేదనీ, ఇప్పటికీ తాను అమరావతికి వ్యతిరేకమేననీ వడ్డే స్పష్టం చేశారు. రాజధాని కోసం ఈ రెండు ప్రభుత్వాలు ఎంచుకున్న అమరావతి, విశాఖ జిల్లాల్లో టిడిపి, వైసిపి నేతల భూముల కొనుగోళ్లపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
విశాఖ రాజధాని తరలింపు వెనుక ప్రభుత్వం పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. టిడిపికి బలం ఎన్టిఆర్ కాగా వైసిపికి బలమే వైఎస్ఆర్ అనీ వాళ్లు మంచి పనులు చేశారు కాబట్టి ఆ పార్టీలను ప్రజలు ఆదరిస్తున్నారనీ వడ్డే అన్నారు.
చిన్న వయసులో సిఎం అయిన జగన్.. ప్రజల మన్ననలు పొందాలే కానీ శకుని మాటలు విని తెలివి తక్కువ నిర్ణయాలతో ప్రజాగ్రహానికి గురికావద్దని ఆయన సూచించారు.