తెలంగాణ కాంగ్రెస్ అంటేనే అంతర్గత రాజకీయాలకు , ఎత్తుగడలకు పెట్టింది పేరు. అలాంటి తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు కొత్త రచ్చ తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో నూతన రథసారథి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకొని అధిష్టానానికి ప్రతిపాదనలు ఇచ్చారు. దీనిపై రచ్చ జరుగుతోంది.
ఆయనకే పీసీసీ పీఠం
తెలంగాణ కాంగ్రెస్ రథసారథి విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ అభిప్రాయాల స్వీకరించి ఐదుగురు నేతల పేర్లు ఫైనల్ చేసినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం , ఈ నెలాఖరులో కొత్త పీసీసీ చీఫ్పై అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు. అయితే, దీనిపై అప్పుడే కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తనదైన శైలిలో ఫైరయ్యారు. ఫైనల్ లిస్ట్లో తన పేరు లేదన్న లీక్పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
రేవంత్ రెడ్డి పేరు ఖరారు?
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించిన లిస్ట్లో నాపేరు అధిష్టానం వద్ద చర్చకు లేకపోవడం దురదృష్టకరమైన విషయమని జగ్గారెడ్డి వాపోయారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ఆఫీసుకి మెసేజ్ మరియు మీడియా ద్వారా తన ఆవేదన జగ్గారెడ్డి తెలియజేశారు. 2017 సంవత్సరంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సంగారెడ్డిలో రాహుల్ గాంధీ కోసం భారీ బహిరంగ సభ కార్యక్రమం నాకు అప్పగించినప్పుడు.. ఆ కష్ట కాలంలో నేను కోట్ల రూపాయలు పెట్టి సభ నిర్వహించానన్నారు.. అయినా నాపేరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు చర్చలో పోకవడం నాకు చాలా బాధ కలిగించిందన్నారు. ఈ రాష్ట్రానికి కొత్తగా వచ్చిన ఇంఛార్జ్ ఈ కార్యక్రమల గురించి తెలుసుకోకపోవడం, నాలాంటి ఆర్గనైజర్ పేరు ఢిల్లీ లిస్ట్లో పంపకపోవడం చాలా బాధకు గురిచేసిందని తన ప్రకటనలో జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ పదవిపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానని జగ్గారెడ్డి అన్నారు. అయితే, ఇప్పటికే పీసీసీ పీఠం రేవంత్ రెడ్డి కి ఖరారు అయిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి చేస్తున్న కామెంట్లు దీనికి బలం చేకూరుస్తున్నాయని అంటున్నారు.