Munugode Results: ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నికల ఫలితం మరి కొద్ది గంటల్లో తేలనుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని అర్జాల బావి వద్ద గోడౌన్ లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. పరిశీలకులు, ఏజంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ను తెరిచి ఈవిఎంలను బయటకు తీసుకువచ్చారు. కౌంటింగ్ ప్రక్రియకు 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు.
మొత్తం 15 రౌండ్ లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. 1,2,3 రౌండ్ లలో చౌటుప్పల్ మండల ఓట్ల లెక్కింపు జరుగుుతంది. 4,5,6 రౌండ్ లలో సంస్థాన్ నారాయణపురం మండల ఓట్లు, 7,8 రౌండ్ లలో మునుగోడు మండల ఓట్ల లెక్కింపు, 9,10 రౌండ్ లలో చండూరు మండల ఓట్లు లెక్కింపు ఫలితం వెలువడుతుంది. 11 నుండి 15 రౌండ్ లలో మర్రిగుడ, నారపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్ల లెక్కింపు ఫలితం వెలువడనుంది. తొలుత 686 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించగా టీఆర్ఎస్ అధికత్యత సాధించింది. టీఆర్ఎస్ కు 228 ఓట్లు రాగా , బీజేపీ అభ్యర్ధికి 224 ఓట్లు,బీఎస్ పికి పది ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ కు నాలుగు ఓట్ల ఆధిక్యత లభించింది.
టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు మొత్తం 47 మంది ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 3వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 2,41,805 మంది ఓటర్లకు గానూ 2,25,192 మంది (93.13శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.