తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కేసిఆర్ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. ఒక పక్క పీసీసీ కమిటీల నియామకంపై సీనియర్ ల నుండి అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్న తరుణంలో టీ కాంగ్రెస్ కి కొత్త తలనొప్పి వచ్చి పడింది. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో ..సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించడం తీవ్ర సంచలనం అయ్యింది. సీఎం కేసిఆర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్న అరోపణలతో కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై మంగళవారం రాత్రి సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేశారు.
డీఎస్పీ, ఇద్దరు ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు సుమారు 200 మంది బందోబస్తుతో ఎస్ కే కార్యాలయానికి చేరుకుని దాదాపు ఆరు గంటల పాటు సోదాలు నిర్వహించారు. కార్యాలయంలో హార్డ్ డిస్క్ లు, లాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు షబ్బీర్ ఆలీ, మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు నేతలు సునీల్ కనుగోలు కార్యాలయం వద్దకు వెళ్లి పోలీసు అధికారులతో వాదనకు దిగారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తొందని నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ వార్ రూమ్ లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. నోటీసులు సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారంటూ నిలదీశారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని కోరగా, కోర్టులో ఇస్తామని పోలీసులు బదులిచ్చారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ అక్కడే కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగగా, వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. షబ్బీర్ ఆలీ ఇంట్లో నేతలందరినీ గృహ నిర్బంధం చేశారు.
ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కాంగ్రెస్ వార్ రూమ్ లో పోలీసుల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. సెర్చ్ వారెంట్ లేకుండా, 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసు ఇవ్వకుండా సుప్రీం కోర్టు తీర్పును పోలీసులు ఉల్లంఘించారనీ, దీనికి మంత్రి కేటిఆర్, సీపీ ఆనంద్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనను వ్యతిరేకిస్తూ బుధవారం సీపీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలతో పాటు సీఎం కేసిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజల స్వేచ్చను రాజకీయ పార్టీల హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
Without following due process of law, KCR police have arrested our staff.
No search warrant, no notice under 41A CrPC given. Complete violation of SC judgment in DK Basu case.@KTRTRS & Commi CV Anand will be held accountable for this lawlessness.
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) December 13, 2022