టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసిఆర్) .. మోడీ సర్కార్ పై దూకుడు పెంచారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉతృతం చేసే క్రమంలో భాగంగా ఈ రోజు జాతీయ నేతలకు ఫోన్ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, తమిళనాడు సీఎం స్టాలిన్ , ఆర్జేడీ నేత తేజశ్వినీ యాదవ్ తదితర నేతలతో సీఎం కేసిఆర్ ఫోన్ లో మాట్లాడినట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అందరూ ఐక్యంగా కలిసి రావాలని ఆయన కోరారు.
మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంట్ వేదికగా కలిసి కట్టుగా పోరాడదామని కేసిఆర్ జాతీయ నేతలను కోరినట్లు తెలుస్తుంది. కేంద్రం మెడలువంచి దేశంలో ప్రజాస్వామిక విలువలను కాపాడే దిశగా అన్ని విపక్ష పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు మంతనాలు కొనసాగిస్తున్నారని టీఆర్ఎస్ పేర్కొంది. బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను తీవ్రంగా ఖండిస్తూ దేశ వ్యాప్త నిరసనలతో కేంద్రం అసలు స్వరూపాన్ని ఎండగట్టేందుకు సీఎం కేసిఆర్ సన్నద్దం అవుతున్నట్లు టీఆర్ఎస్ తెలిపింది.
కేంద్రం పై ప్రజాస్వామిక పోరాటంలో భాగంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రతిపాదనలకు పలు రాష్ట్రాల విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు సానుకూలంగా స్పందిస్తున్నట్లు టీఆర్ఎస్ తెలిపింది. మరో పక్క ఈ నెల 18వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు మొదలు అవుతున్న నేపథ్యంలో ఉభయ సభల్లో టీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేసేందుకు రేపు (శనివారం) ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ వెల్లడించింది.