TS High Court: ఎన్నికల్లో గుర్తు ను పోలిన గుర్తులు పలు ప్రధాన పార్టీల కొంప ముంచుతుంటాయి. అభ్యర్ధుల మధ్య కీన్ కంటెస్ట్ ఉన్న సమయంలో ప్రతి ఓటు పార్టీలకు కీలకంగా మారుతుంటాయి. త్రిముఖ పోటీ, బహుముఖ పోటీ నెలకొన్న సమయంలో కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్ధుల చీలిక ఓట్ల ప్రభావం ప్రధాన పార్టీలపై పడుతుంటుంది. ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తు పోలిన గుర్తు స్వతంత్ర అభ్యర్ధులకు వస్తే కొందరు నిరక్షరాస్యులు కన్ఫూజ్ అయి తాము ఓటు వేయాలని అనుకున్న అభ్యర్ధికి కాకుండా వేరే వాళ్లకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. గతంలో ఇలాంటి సందర్భాలు వెలుగు చూశాయి. అందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో అటువంటి పరిస్థితి ఎదురు కాకుండా టీఆర్ఎస్ ముందుగానే అప్రమత్తమైంది.
టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన 8 ఫ్రీ సింబల్స్ ను తొలగించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు గత సోమావరం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అయితే దీనిపై ఎన్నికల అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మునుగోడు ఉప ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఈ రోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. కారు గురును పోలి ఉన్న ఎనిమిది గుర్తులు తొలగించే విధంగా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టుమిషన్, ఓడ గుర్తులను కేటాయించకుండా చూడాలని టీఆర్ఎస్ కోరింది. భోజన విరామ సమయంలో అత్యవసర విచారణ జరపాలని విజ్ఞప్తి చేయగా ధర్మాసనం నిరాకరించింది. నవంబర్ 3వ తేదీన పోలింగ్ ఉన్నప్పటికీ ఈసీ నిర్ణయం తీసుకోవడం లేదని టీఆర్ఎస్ హైకోర్టుకు తెలిపింది. అయితే సీజే నేతృత్వంలోని ధర్మాసనం రేపు విచారణ జరుపుతామని పేర్కొంది.
గతంలో 2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్ధులకు నష్టం జరిగిందని టీఆర్ఎస్ చెబుతోంది. తమ పార్టీ అభ్యర్ధులకు రావాల్సిన ఓట్లు కారను పోలిన గుర్తు కల్గిన అభ్యర్ధులకు పడ్డాయని చెబుతున్నారు. మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్ లో 2018 ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని టీఆర్ఎస్ నేతలు తెలిపారు. అదే విధంగా నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, అసిఫాబాద్, బాన్సువాడ, నాాగార్జునసాగర్ ఎన్నికల్లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కంటే ఎక్కువ ఓటలు పడ్డాయని పేర్కొంటున్నారు. మరో పక్క మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ ల ఉప సంహరణ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది. ఈ తరుణంలో హైకోర్టు టీఆర్ఎస్ పిటిషన్ పై విచారణ జరిపి ఏ విధమైన ఆదేశాలు జారీ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.