YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. షర్మిల ఆరోగ్యం క్షీణించడంతో అర్దరాత్రి ఆమెను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల రెండు రోజులుగా లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. షర్మిల దీక్షకు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ మద్దతు తెలియజేస్తూ సంఘీభావంగా దీక్షలో కూర్చున్నారు. నిన్న ఉదయం, సాయంత్రం అపోలో ఆసుపత్రి వైద్యులు దీక్షా శిబిరానికి చేరుకుని షర్మిల ఆరోగ్య పరిస్థితిపై పరీక్షలు జరిపారు. తక్షణం ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందించకపోతే డిహైడ్రేషన్ ప్రభావం కిడ్నీలపై పడుతుందని హెచ్చరించారు.
తన పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకూ దీక్ష కొనసాగిస్తానని షర్మిల తేగేసి చెప్పారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. శుక్రవారం తమ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు శనివారం కూడా విడుదల చేయలేదనీ, పాత కేసులను తవ్వి రిమాండ్ కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ కార్యాలయం చుట్టూ ఏర్పాటు చేసిన కర్ఫ్యూని ఎత్తివేసి, తమ పార్టీ కార్యకర్తలను విడుదల చేసే వరకూ దీక్ష విరమించేది లేదని షర్మిల దీక్ష భగ్నంకు ముందు తెలిపారు.
కాగా షర్మిల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకుని అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు సెలైన్ బాటిల్ పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. లోటస్ పాండ్ సమీపంలో బారికేడ్లు ఏర్పాటు భారీగా పోలీసులు మోహరించారు.