YS Sharmila: జగనన్న వదిలిన బాణంగా గతంలో తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జగన్ కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల..అనంతరం కుటుంబంలో ఏర్పడిన విభేధాల నేపథ్యంలో తన రాజకీయ ప్రస్థానాన్ని తెలంగాణలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్ టీపీ) గా రాజకీయ పార్టీ పెట్టి కేసిఆర్ సర్కార్ పై వివిధ రూపాల్లో పోరాటాలు సాగిస్తూ వచ్చారు. అయితే వైఎస్ఆర్ టీపీకి తెలంగాణలో అనుకున్న రీతిలో ఆదరణ లభించకపోవడం, ఒక వేళ స్వతంత్రంగా పోటీ చేస్తే కాంగ్రెస్ ఓట్ల చీలిక ప్రభావంతో అది అంతిమంగా కేసిఆర్ సర్కార్ కే మేలు చేసేదిగా ఉండటంతో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్దమైయ్యారు.
వైఎస్ షర్మిల కుటుంబానికి సన్నిహితుడైన కర్ణాకట పీసీసీ అధ్యక్షుడు, అక్కడి డిప్యూటి సీఎం డీకే శివకుమార్ దౌత్యంతో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిగాయి. ఇంతకు ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తో సమావేశమైన వైఎస్ షర్మిల .. ఈవేళ ఉదయం ఢిల్లీలో సోనియాతో సమావేశమైయ్యారు. షర్మిల వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్ కూడా పాల్గొన్నారు. దాదాపు గంటన్నరపాటు బ్రేక్ ఫాస్ట్ సమావేశం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో పార్టీని విలీనం చేయడం వల్ల ఎలాంటి హామీ వస్తుంది..? ప్రాధాన్యం ఏమిటి..? షర్మిల సేవలను ఏరకంగా వాడుకుంటారు..? అనే దానిపై చర్చలు జరిగినట్లు తెలుస్తొంది.
వివిధ అంశాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తొంది. షర్మిల తన రాజకీయం మొత్తం తెలంగాణలో కొనసాగించాలని భావిస్తుండగా, ఆమె సేవలను తెలంగాణతో పాటు ఏపీలోనూ వినియోగించుకోవాలని పార్టీ అధిష్టానం యోచన చేస్తొంది. పాలేరు నుండి పోటీ చేయాలని షర్మిల అనుకుంటుండగా, ఆమెకు కర్ణాటక నుండి రాజ్యసభ కు పంపుతామని అఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
సోనియాతో సమావేశం ముగిసిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. సోనియా, రాహుల్ గాంధీ తో మంచి సమావేశం జరిగిందని, నిర్మాణాత్మక చర్చలు జరిగాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరం పని చేస్తుందని అన్నారు. కేసిఆర్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. సోనియాతో ఫైనల్ చర్చలు జరిగిన నేపథ్యంలో పార్టీ విలీనంపై రెండు మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడనుందని భావిస్తున్నారు. అయితే షర్మిల సేవలను ఆంధ్రప్రదేశ్ లేక తెలంగాణ కు వాడుకుంటారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
BRS: కెసిఆర్ ఇంటి ముందర సర్పంచ్ నవ్య ధర్నా ? ఉలిక్కిపడ్డ తెలంగాణా !