అబ్బే…! ఈ సెల్ ఫోన్లకు.., కెమెరాలకు బొత్తిగా బుద్ధి లేకుండా పోతుంది..!! మహిళలు ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు ఢిల్లీ వెళ్తే వారి వెంట కూడా వెళ్లిపోయాయి..! వెళ్లిన ఫోన్లు ఊరకే ఉండవుగా.., కెమెరాలకు పని చెప్పాయి..! కెమెరాలు ఊరకే ఉండవుగా.., ఫోటోలు తీసేశాయి..! తీసిన ఫోటోలు ఊరకే ఉండవుగా.., బయటకు వచ్చాయి..! బయటకు వచ్చాక ఊరకే ఆగదుగా.., సోషల్ మీడియాకు చిక్కాయి..! ఇక చూసుకోండి సెటైర్లే, సెటైర్లు..!!
గత తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ ఎంపిలు దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూ అమరావతి జెఏసి మహిళా నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లి అక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జాతీయ నేతలు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులకు అమరావతి రాజధాని సమస్యను విన్నవించి మద్దతు కోరడానికి వెళ్లారు. ఈ క్రమంలో మహిళా నేతలు వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజును కలిసి సన్మానం చేశారు. అనంతరం టీడీపి ఎంపి గల్లా జయదేవ్ను కలిసి విందు భోజనం చేశారు. ఈ పరిణామంపై వీరి ప్రత్యర్ధులు వ్యగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
ఢిల్లీలో వీరిని ఎవరు దేకకపోవడం (చూడకపోవడం)తో.. విగ్గుల రాజు (రఘురామ కృష్ణం రాజు) ను అమరావతి పేద రైతులు కలిసి సన్మానం చేశారనీ, అమర రాజా (గుంటూరు ఎంపి గల్లా జయదేవ్) ఫైవ్ స్టార్ హోటల్ నుండి తెప్పించిన భోజనం చేస్తూ నిరుపేదలు తమ బాధలను చెప్పుకున్నారని సెటైర్ వేస్తూ నెటిజల్లు సెటిరైటికల్గా కామెంట్స్ చేస్తున్నారు.
ఢిల్లీకి వెళ్లిన బృందంలో సుంకర పద్మశ్రీ (కాంగ్రెస్), అక్కినేని వనజ (సిపిఐ), టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, రాయపాటి శైలజ (జెఎసి ప్రతినిధి), మహిళా రైతులు కంభంపాటి శిరీష, మువ్వ సుజాత, ప్రియాంక లు ఉన్నారు.