అమరావతి, డిసెంబరు 23 : రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న వ్యతిరేక ధోరణిపై సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం శ్వేతపత్రం విడుదల చేశారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన విధంగా 10అంశాలపైన రోజుకొక శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వం కావాలని వ్యతిరేకత కనబరుస్తోందన్నారు. రాజధాని నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధానమంత్రి మోదీ మట్టీ, నీళ్ళు తప్ప నిధులు ఎందుకు ఇవ్వడంలేదని విమర్శించారు. రాజధానికోసం నామమాత్రంగా నిధులు కేటాయించారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఇటువంటి తరుణంలో ప్రధాన ఆంధ్రాపర్యటనకు ఏవిధంగా వస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష వైఎస్సార్కాంగ్రెస్ , జనసేన పార్టీలు బిజెపి, మోదీని ఎందుకు వ్యతిరేకించడంలేదన్నారు.
రానున్న రోజుల్లో శ్వేతపత్రాలపై జన్మభూమి కార్యక్రమంలో చర్చించడంతోపాటుగా ధర్మపోరాటాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దేశానికి బిజెపి వల్ల తీవ్రంగా నష్టం జరుగుతోందని, బిజెపి నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు.
శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలివే…
- 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం మరియు సంబంధిత హామీల అమలుపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
- ప్రజాస్వామ్యంలో చట్టాల్ని అమలు చేయడం, ఇచ్చిన హామీలను నెరవేర్చడం చాలా అవసరం.
- ఇది అసాధరణమైన అంశం, ఐదుకోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి జీవన్మరణ సమస్య.
- పాలకులు ఏ తప్పు చేసినా ప్రజల జీవితాల్ని ప్రభావితం చేస్తుంది.
- మద్రాసు ప్రెసిడెన్సీలో వున్నప్పుడు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేశారు
- అక్కడ నుంచి కర్నూలు వచ్చి రేకుల షెడ్డులో ప్రభుత్వ పాలన నడిపాం.
- ఆ తరువాత తెలుగువారంతా కలిసి ఉండాలని హైదరాబాద్ వెళ్లాం.
- గాలివాన తరువాత ఎలాంటి నిశ్శబ్దత వస్తుందో అలాంటి పరిస్థితిని విభజన తరువాత చూశాం.
- ప్రజానీకానికి మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాలని ఆనాడు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాం.
- అప్పుడున్న పరిస్థితుల్ని అర్ధం చేసుకుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం.
- రాష్ట్రానికి న్యాయం చేస్తుందనే నమ్మకంతోనే కలిసి ప్రయాణం చేశాం.
- కానీ, చట్టాన్ని ఏవిధంగా అమలు చేయలేదు. హామీలను గాలికి వదిలేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఏవిధంగా ఇబ్బంది పెట్టారో చెప్పడానికే ఈ శ్వేతపత్రం.
- తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పారదర్శకంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు వాస్తవ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజెప్పాం.
- ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోజు పరిస్థితుల్ని వివరిస్తూ 8 శ్వేతపత్రాల్ని విడుదల చేశాం.
- ప్రజల్లో కసిని పెంచేందుకే నవ నిర్మాణ దీక్ష, మహా సంకల్పం కార్యక్రమాల్ని పెట్టుకున్నాం.
- మిగిలిన రాష్ట్రాలతో సమానంగా ఎదగాలనే కసితో పనిచేశాం. కష్టపడి కొంతవరకు నిలదొక్కుకున్నాం.
- పార్లమెంటులో ఒక విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాం.
- పార్లమెంటులో రెండున్నర సంవత్సరాలు పోరాటం చేశాం.
- విభజన చట్టంలో పేర్కొన్న హామీలొక్కటే చాలవు, ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇవ్వాలని ఆనాడు సభలో ప్రకటించారు.
- 11 జాతీయ సంస్థలకు హామీ ఇచ్చారు.
- 8 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు హామీ ఇచ్చారు.
- ప్రధాని మోదీ ఇక్కడకు వస్తామంటున్నారు. ఎందుకు వస్తున్నారు? మేము బతికామా చచ్చామా చూడ్డానికి వస్తున్నారా? మా పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన మీరు ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తామంటున్నారు?
- శ్వేతపత్రం పూర్తి పాఠం కొరకు ఈ క్రింది లింక్ను క్లిక్ చేయండి