ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇండియాని ఇప్పుడిప్పుడే భయపెడుతుంది. చైనాలో పుట్టి, ఆ దేశాన్ని అతలాకుతలం చేసి.., ఇటలీని తాకి వణికించి.., ఇరాక్ లో భయం రేకెత్తించి, 140 దేశాలకు తన ఉనికిని పరిచయం చేసిన కరోనా మన దేశంలో ఇప్పుడే ఉధృతి పెంచింది. ప్రస్తుతం రెండో దశలో ఉన్న ఈ వైరస్ రానున్న నెల రోజుల్లో విస్తృతంగా విజృంభించి, మరింత చెలరేగుతుందని వార్తలు వస్తున్నాయి. దీని నుండి జాగ్రత్తలు, అప్రమత్త సూచనలు ఇప్పుడు అన్ని మీడియాలోనూ వస్తున్నాయి. కరోనా వెనుక, ముందు అనేక గమ్మత్తులు ఉన్నాయి. విశేషాలు ఉన్నాయి. వాటిని ఒకసారి తెలుసుకుందాం రండి.
వ్యూహాన్లో ఇప్పుడు లేదు…!
కరోనా వైరస్ పుట్టింది చైనాలోని వ్యూహాన్ నగరంలో. ఈ వైరస్ ని ఎదుర్కోడానికి చైనా ఏకంగా పది రోజుల్లోనే పది వేలపడకల ఆసుపత్రిని నిర్మించింది. ఇది ఎలా పుట్టింది అనేది ఇప్పటికీ నిర్ధారణ కాలేదు. కానీ గబ్బిలాలను తినడం వల్లనే ఇది మానవుల్లోకి వ్యాపించింది అని ఎక్కువ ప్రచారంలో ఉంది. వ్యూహాన్ నగరాన్ని నెల రోజుల పాటు వణికించిన ఈ వైరస్ ఇప్పుడు అక్కడ లేదు. ఒక్కరు కూడా అక్కడ కరోనా పాజిటివ్ లేరని తాజాగా చైనా అధికారికంగా నిర్ధారించింది. ఆ దేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
దేశంలో అప్రమత్తత…!
ఇండియాలో దడి మొదలయ్యింది. ఇప్పటికే 170 మందికి ఈ వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ జరగ్గా అయిదుగురు మరణించారు. మరో వేయి మందికి పైగా ఈ లక్షణాలతో బాధ పడుతున్నారు. ఎక్కువగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభావం ఉంది. తెలంగాణలోని కరీం నగర్ లో ఇండోనేసియా నుండి వచ్చిన 13 మందికి పాజిటివ్ తేలింది. వీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకు వచ్చారు? అనేది తేలట్లేదు. చర్చిలో ప్రార్థనలకు వచ్చారని మాత్రం అంటున్నారు. కర్ణాటకలో ఇప్పటికే ఆరోగ్య ఎమెర్జిన్సీ ప్రకటించగా అదే దిశలో తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర కూడా ఉన్నాయి. ఏపీలో ఇప్పటి వరకు రెండు కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 150 రైళ్లు రద్దయ్యాయి. పలు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఆలయాలు, బడులు, కళాశాలలు, షాపింగ్ మాలలు, సినిమా హాళ్లు అన్ని మూత పడుతున్నాయి. ప్రధాని మోడీ ఈరోజు రాత్రికి కరోనా విస్తృతి, నివారణ చర్యలు, అమలు చేయనున్న విధానాలను ప్రకటించనున్నారు.
ఇలా విస్తృతి…!
ప్రపంచంలో కరోనా కేసుల లెక్క కూడా గణనీయంగా పెరుగుతుంది. ఒక్కసారిగా లెక్కకు మిన్హసి పాజిటివ్ నమోదవ్వడం ప్రపంచ ఆరోగ్య నిపుణులను సైతం వణికిస్తుంది. మొదటి సరిగా జనవరి 19 నాటికి 100 కేసులు నమోదవ్వగా.., జనవరి 24 నాటికి 1000 కేసులు.., జనవరి 28 నాటికీ 5000 కేసులు, ఫిబ్రవరి 12 నాటికీ 50 వేలు .., మార్చి ఆరు నాటికీ లక్ష మందికి, మార్చి 14 నాటికి లక్షన్నర మందికి.., మార్చి18 రెండు లక్షల మందికి ఈ వ్యాధి సోకింది. అంటే ఒకసారి సోకినా తర్వాత విస్తృతి వేగంగా పెరుగుతుంది.