(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కరోనాకు వారు వీరు అని తేడా లేదు. పేషంట్ లకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కరోనా వైరల్ బారిన పడుతున్నారు. దీనితో పేషంట్ ల చేయి పట్టుకునేందుకు వైద్యులు దడుస్తున్నారు. ప్రైవేట్ వైద్యులు ఓపి సేవలు పూర్తిగా నిలిపి వేసి ఇళ్లకే పరిమితం అయ్యారు. ఏపిలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా సరైన వ్యక్తిగత రక్షణ పరికరాలు (పర్సనల్ ప్రొటెక్టీవ్ ఎక్విప్మెంట్ -పిపిఈ) లు లేకుండా వైద్యసేవలు అందించలేమని స్పష్టం చేస్తున్నారు.
ఇటలీలో 45మంది వైద్యులు కరోనా వైరస్ తో మరణించగా ఆరు వేలకు మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు కరోనా వైరస్ బారిన పడ్డారు. యూకెలో భారత సంతతికి చెందిన ప్రముఖ హుద్రోగ నిపుణుడు జితేంద్ర కుమార్ రాధోడ్ కరోనాతో మృతి చెందాడు. భారత దేశంలోనూ 50మందికి పైగా వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది ఇప్పటి వరకు కోవిడ్ -19 సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు ధ్రువీకరించాయి. పుణెలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి చికిత్స చేసిన వైద్యులు, సిబ్బంది మొత్తం 92మంది క్వారంటైన్ కు వెళ్లాల్సివచ్చింది.
కరోనా వైరస్ బాధితులు, అనుమానితులకు చికిత్స చేసిన వైద్య సిబ్బంది క్వారంటైన్ కు వెళుతుండటం కలవరపెడుతోంది. నరాల సమస్యతో ఢిల్లీ ఎయిమ్స్ కు వచ్చిన 72ఏళ్ళ వ్యక్తికి కోవిడ్ -19 సోకినట్లు తేలడంతో వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణులు సహా 30మంది క్వారంటైన్ కు వెళ్లారు.
సమస్య ఎత్తి చూపిన వైద్యుడు సస్పెన్షన్
విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి మత్తు వైద్య నిపుణుడు డాక్టర్ సుధాకర్ రెండు రోజుల క్రితం ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మాస్కులు, పిపిఈ కిట్ల కొరతపై బాహాటంగా విమర్శించారు. ప్రభుత్వం వైద్యుల బాగోగులు పట్టించుకోవడం లేదని, ఒక్కో మాస్కు 15 రోజులు వాడమంటున్నారని వ్యాఖ్యానించారు. అతని వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వం ఆ వైద్యుడిపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఇద్దరు వైద్యులు, సిబ్బందికి కరోనా పాజిటివ్
అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ తో మృతి చెందిన వ్యక్తి కి తొలుత వైద్య సేవలు అందించిన ఇద్దరు వైద్యులు, ఇద్దరు సిబ్బందికీ వైరస్ సోకింది.
వారం పని చేస్తే 2వారాలు క్వారంటైన్
కరోనా బాధితులకు సేవలు అందించే ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది విషయంలో వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. వారం రోజులు పని చేసిన తర్వాత వారిని రెండు వారాలు క్వారంటైన్ కు పంపుతారు. ఆ తరువాతే వారు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.