(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనకు ముందే రైతుల నుండి నిరసన సెగలు వెల్లువెత్తాయి. గురువారం(నవంబర్ 28) చంద్రబాబు అమరావతిలో పర్యటించబోతున్న తరుణంలో రాజధాని రైతులు ఆందోళన బాట పట్టడం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.
ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటించాలని అనుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణ పనులు, ఇతర పనుల పురోగతిని పరిశీలించేందుకు బాబు అక్కడకు వెళ్లనున్నారు. కొత్త ప్రభుత్వంలో ఏవైనా పనులు జరిగాయా ? లేదా ? టీడీపీ హయాంలో ప్రారంభించిన పనులు ఎంత వరకు వచ్చాయో ఆరా తీయనున్నారు.
అయితే, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంపై వివాదం నడుస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ సహా పలువురు మంత్రులు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వేడి పుట్టించాయి. రాజధానిపై వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది టీడీపీ. గత ప్రభుత్వ హాయాంలో రాజధాని నిర్మాణం కోసం భారీగా భూ సేకరణ జరిగింది. సింగపూర్, జపాన్ల నుంచి పలువురు నిపుణులను రప్పించి అనేక డిజైన్లను రూపకల్పన చేశారు. అయితే, ఏపీ రాజధాని ప్రాంతంలో సింగపూర్ ప్రాజెక్టును సైతం సీఎం జగన్ రద్దు చేశారు. దానికి తోడు అమరావతి విషయంలో వైసీపీ..రాజధాని కమిటీ వేసింది. ఈ కమిటీ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజాభిప్రాయసేకరణ చేస్తోంది. దీంతో రాజధాని ప్రాంతం మారిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక రాజధాని ప్రాంతంలోని తాత్కలిక నిర్మాణాలు, చిన్న వర్షానికే మడుగులు కట్టేయడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. శాశ్వత హైకోర్టు, రాజధాని తమ ప్రాంతంలోనే నిర్మించాలని సీమ ప్రాంతం నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబు పర్యటనపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.
చంద్రబాబు పర్యటనకు నిరసనగా నల్ల జెండాలు పాతి నిరసనకు దిగారు అసైన్డ్ భూముల రైతులు. రాజధాని పేరుతో చంద్రబాబు అసైన్డ్ భూములు రైతులను మోసం చేశారని ఆరోపిస్తున్నారు. అసైన్డ్ భూములు ఒక ప్యాకేజీ, పట్టా భూములకు మరో ప్యాకేజీ ఇచ్చి చంద్రబాబు దళితులకు అన్యాయం చేశారని చెబుతున్నారు. ఇది అన్యాయం అని అడిగితే గత ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు పెట్టిందని విమర్శిస్తున్నారు. రాజధానిలో చంద్రబాబు ప్రభుత్వం దళితుల పట్ల తీవ్రమైన వివక్ష చూపిందని ఆరోపించిన అసైన్డ్ రైతులు.. చంద్రబాబు అసైన్డ్ భూముల రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు బినామీలు అసైన్డ్ భూములు కొన్న తర్వాత దళితులు సాగుచేస్తున్న అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగులోకి తీసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటన ఎలా సాగుతుంది ? అనేది ఉత్కంఠగా మారింది.