(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కృష్ణాజిల్లా గన్నవరం వైసీపీ రాజకీయం గరంగరంగా మారింది. వైసీపీలోని వర్గాలే ఘర్షణలు పడటం, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది. టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలో చేరడానికి ప్రయత్నించినప్పుడే ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకించారు. నియోజకవర్గ వైసీపీలోనే మరో బలమైన వర్గ నేత డాక్టర్ దుట్టా రామచంద్రరావు మాత్రం తొలుత వంశీ వైసీపీలోకి రాకను స్వాగతించారు. ఈ నేపథ్యంలో వంశీని టీడీపీకి దూరం చేయాలి, వైసీపీలోకి తీసుకోవాలని భావించిన వైసీపీ అధిష్టానం యార్లగడ్డ వెంకట్రావును కెడీసీసీ చైర్మన్ పదవి ఇచ్చి శాంతింపజేసింది.
ఇక అనధికారికంగా వైసీపీ పంచన చేరిన వల్లభనేని వంశీ నియోజకవర్గంలో పెత్తనం చేయడం ప్రారంభించడంతో వంశీ వర్గీయుల హవా మొదలు అయ్యింది. తానే ఎమ్మెల్యేని, తాను నియోజకవర్గ నాయకుడిని అని వంశీ ప్రకటించుకోవడంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లోనూ తానే పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రకటన అనంతరం వంశీ నాయకత్వాన్ని దుట్టా కూడా వ్యతిరేకించారు. ఆ తరువాత యార్లగడ్డ, దుట్టా వర్గీయులతో వంశీ వర్గీయుల ఘర్షణలు పడటం, కొట్టుకోవడం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసుకోవడం వరకూ వెళ్లింది.
వంశీతో కలిసి పని చేసేది లేదు..!
ఎమ్మెల్యే వంశీ తీరును దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. వంశీతో కలిసి పని చేసే అవకాశం లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. నియోజకవర్గంలో పరిస్థితులను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళతామని అంటున్నారు. నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే తానే పోటీ చేస్తానని కూడా దుట్టా ప్రకటించారు. వంశీ చేరికతో తొలి నుండి వైసీపీలో ఉన్న క్యాడర్ అసంతృప్తికి గురి అవుతోందని ఈ ఇద్దరు నేతలు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగా పలువురు వంశీ వర్గీయులు రెండు రోజుల క్రితం జరిగిన యార్లగడ్డ వెంకట్రావు జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆయనకు షాక్ ఇచ్చారు.
రాజకీయాల నుండి తప్పుకునే అలోచనలో వంశీ..?
నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులపై మనస్థాపానికి గురైన వల్లభనేని వంశీ క్రీయాశీల రాజకీయాల నుండి తప్పుకోవాలని యోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న వంశీ తన అనుచరులతో భేటీ అయి యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలు, నియోజకవర్గ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. నిన్న నియోజకవర్గంలోని బాపులపాడు మండలంలో వంశీ పర్యటించాల్సి ఉన్నా యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వంశీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తన భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్యనేతలతో వంశీ చర్చించారు. వంశీ రాజకీయాల నుండి తప్పుకునే యోచన చేస్తున్నారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. ఈ పరిణామాల క్రమంలో గన్నవరం రాజకీయాలు హాట్ హాట్ మారిపోయాయి. పార్టీ అధిష్టానం గన్నవరం నేతల సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.