చైనా దుందుడుకు చర్యల వల్ల జరిగిన ఘర్షణలో 21 మంది భారత జవాన్లు అమరులవగా, చైనాకు కూడా 44 వరకు ప్రాణనష్టం జరిగినట్లుగా చెబుతున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం టిక్టాక్, యూసీ బ్రౌజర్, హెలో వంటి యాప్స్ను బ్యాన్ చేసింది. అయితే తాజాగా నీల్సన్ మీడియా సర్వేలో ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది.
జూన్ 15న గాల్వాన్ ఘటన జరిగిన విషయం తెలియగానే భారతీయులు ఎక్కువమంది చైనీస్ యాప్స్ను ఉపయోగించడం తగ్గించారని నీల్సన్ మీడియా సర్వేలో వెల్లడైంది. జూన్ 20వ తేదీ నాటికి ఈ యాప్స్ను ఉపయోగించే వారి సంఖ్య 5 శాతం తగ్గి 77 శాతానికి చేరుకుందని, ఆ తర్వాత 76 శాతానికి చేరుకుందని వెల్లడించింది. టైర్ 1 నగరాల్లో అలాగే 15-24 ఏళ్ల యువత యాప్స్ వాడకాన్ని ఎక్కువగా తగ్గించింది. ఈ రెండు సెగ్మెంట్లలో ఏకంగా 11 శాతం తగ్గినట్లు ఈ సర్వే వెల్లడించింది.
ఈ యాప్స్ను ఉపయోగించే సగటు సెషన్ల సంఖ్య జూన్ 27వ తేదీకి 10 శాతం తగ్గింది. జూన్ 20తో ముగిసిన వారానికి ఇది 7.4 శాతం ఉండగా, జూన్ 27తో ముగిసిన వారానికి 5.4 శాతానికి పడిపోయింది. 15-24 ఏళ్ల వయసులోని పురుషులు ఈ యాప్స్ చూడటం బాగా తగ్గించారు. ఈ సెగ్మెంట్లో 18 శాతం తగ్గింది. టైర్ 2 నగరాల్లో అయితే ఏకంగా 20 శాతం తగ్గింది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో జూన్ 13వ తేదీతో ముగిసిన వారానికి ఈ యాప్స్ యూసేజ్ 80 శాతానికి చేరుకుంది. సగటు సెషన్ల సంఖ్య రోజుకు 8గా ఉంది. అంటే ప్రభుత్వం ప్రకటించడానికి ముందే ప్రజలు చైనా యాప్స్ను బహిష్కరించడం పెద్ద ఎత్తున ప్రారంభించారు. చైనా యాప్స్ను వాడవద్దని అప్పటికే సోషల్ మీడియా సహా వివిధ మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీంతో ఈ యాప్స్ పైన ప్రభావం పడింది. నీల్సన్ 15-44 ఏళ్ల మధ్య వయస్సు గల 1 లక్ష మొబైల్ ఫోన్స్ డేటా ఆధారంగా ఈ నివేదిక తయారు చేసింది.
ఇదిలా ఉండగా బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC) టీవీ వ్యూయర్ షిప్ జూలై 3తో ముగిసిన వారానికి 1.017 ట్రిలియన్ మినట్స్గా ఉంది. ప్రీ-కోవిడ్ సమయంలో ఇది 887 బిలియన్ మినట్స్గా ఉంది. అయితే లాక్ డౌన్ సమయం కంటే మాత్రం తక్కువ. లాక్ డౌన్ సమయంలో 1.266 ట్రిలియన్ మినట్స్గా ఉంది. కరోనా, గాల్వాన్ సహా వివిధ కారణాలతో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపడంతో వీక్షకుల సంఖ్య పెరిగింది. కొత్త కంటెంట్ లేకపోవడంతో వినోదం, స్పోర్ట్స్కు డిమాండ్ తగ్గింది. అంతేకాదు, ప్రకటనలు కూడా మందగించాయి. కరోనా సమయంలో రీ-టెలికాస్ట్ అయిన పౌరాణిక సీరియల్స్ ఎక్కువగా చూశారు.