Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో 37వ నిందితుడుగా చంద్రబాబు పేరును చేర్చారు. కేసులో నిందితుడుగా ఉన్న ఎవరినైనా అరెస్టు చేయడంలో తప్పులేదు కానీ చంద్రబాబును అరెస్టు చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది వైసీపీకి రాజకీయంగా నష్టం తీసుకొచ్చేలా ఉందనే మాట వినబడుతోంది. ప్రస్తుతం చంద్రబాబు నంద్యాల పర్యటనలో ఉన్నారు. చుట్టూ వందలాది మంది కార్యకర్తలు, నాయకులు ఉండగా అర్ధరాత్రి సమయంలో ఆయనను అరెస్టు చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వెళ్లడం విమర్శలకు దారి తీస్తొంది.
స్కిల్ డవలప్ మెంట్ కుంభకోణం కేసులో రూ.371 కోట్లు దారి మళ్లాయని వైసీపీ సర్కార్ గుర్తించింది. దీనిపై నిగ్గు తేల్చిన మంత్రివర్గ ఉప సంఘం విచారణ చేపట్టింది. అనంతరం 2020 డిసెంబర్ 10న విజిలెన్స్ విచారణ, 2021 ఫిబ్రవరి 9న ఏసీబీ విచారణ చేపట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసును 2021 డిసెంబర్ 9న సీఐడీకి బదిలీ చేశారు. 166, 167, 418, 420, 465, 468, 471,409, 201, 109 రెడ్ విత్ 120 బీ ఐపీసీ, 13(2), రెడ్ విత్ 13(1)సీ, రెడ్ విత్ 13(1)(డీ) పీసీఏ సెక్షన్ ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది. ఓ రాజకీయ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న నాయకుడిని అరెస్టు చేసిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
చంద్రబాబును అరెస్టు చేయాలని భావిస్తే పర్యటనలో జనాల మధ్య ఉన్నప్పుడు కాకుండా ఇంటి వద్ద ఉన్నప్పుడు నోటీసు అందజేసి ఉంటే ఇంత రాద్ధాందం కాదనే మాట వినబడుతోంది. చంద్రబాబు చుట్టూ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్న సమయంలో అరెస్టు చేయడం ఉద్రిక్తతలకు దారి తీస్తుందని తెలిసి కూడా సీబీఐ అధికారులు అలా ఎందుకు చేశారనే మాట అధికార పార్టీ సానుభూతి పరుల నుండి కూడా వస్తొంది. చంద్రబాబు అరెస్టు పై నంద్యాల నడిరోడ్డులో హైడ్రామా నడిచింది. చంద్రబాబును అరెస్టు చేస్తున్న క్రమంలో ఆయన న్యాయవాదులు, ఇతర నాయకులు సీఐడీ అధికారులను ప్రశ్నించడాన్ని న్యూస్ ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి కూడా. ఇలాంటి చర్యలు చంద్రబాబుకు రాజకీయంగా మైలేజీ పెంచడానికే తప్ప, అధికార పార్టీ సాధించింది ఏమిటో అర్ధం కావడం లేదని అంటున్నారు.
మరో వైపు చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలకు పిలుపునిచ్చారు. సీఐడీ చేసిన ఈ చర్య టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం కల్గిస్తుందని భావిస్తున్నారు. చంద్రబాబు ను అరెస్టు చేసిన విధానం చూస్తే జగన్ సర్కార్ సెల్ఫ్ గోల్ చేసుకుందన్న కామెంట్స్ వినబడుతున్నాయి. ప్రజల్లో సానుభూతి పొందేందుకే చంద్రబాబు రెండు రోజుల క్రితమే తనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయనీ లేకపోతే దాడి జరగవచ్చని సంచలన కామెంట్స్ చేశారు.
ఒ పక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ పర్యటనలో ఉన్న తరుణంలోనే సీఐడీ ఈ కేసులో అరెస్టులకు సిద్దమవుతుందన్న సమాచారం ముందుగా చంద్రబాబుకు అందడం వల్లనే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. పక్కా సమాచారం ఉండటం వల్ల చంద్రబాబు కొద్ది రోజులుగా జనాల మధ్య ఉంటూ పర్యటనలు పెట్టుకున్నారని అనుకుంటున్నారు. పలు వైసీపీ అనుకూల మీడియాలోనూ చంద్రబాబు అరెస్టు తీరును తప్పుబడుతూ కథనాలు ఇస్తుండటం గమనార్హం. ఇది జగన్ సర్కార్ సెల్ఫ్ గోల్ అనే ప్రచారం జరుగుతోంది.
Chandrababu: చంద్రబాబు ఊహించిందే జరిగింది.. చంద్రబాబును అరెస్టు చేసిన ఏపీ సీఐడీ