(న్యూస్ఆర్బిట్ బ్యూరో)
రష్యా నుండి ఇండియా కొనుగోలు చేయాలనుకుంటున్న అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ -400ను చైనా విజయవంతంగా పరీక్షించింది.రష్యాతో 2015లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ ఏడాది జూలైలో చైనాకు ఈ వ్యవస్థ సమకూరింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పరీక్షించడం మాత్రం ఇదే తెలిసారి. సెకనుకు మూడు కిలో మీటర్ల సూపర్ సానిక్ స్పీడుతో దూసుకెళ్ళిన ఈ డిఫేన్స్ సిస్టమ్, 250 కిలో మీటర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. పీఎల్ఏ రాకెట్ఫోర్స్ ఈ ఎస్ -400ను పరీక్షించినట్లు రష్యన్ మీడియా వెల్లడించింది. అయితే ఈ పరీక్షను ఎక్కడ నిర్వహించాలన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇదే రక్షణ వ్యవస్థను రష్యా నుండి కొనుగోలు చేయడానికి గత అక్టోబర్లోనే భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ 500కోట్ల డాలర్లు.
అమెరికా ఆంక్షల భయం వెంటాడుతున్నా రష్యాతో భారత్ ఈ ఒప్పందం చేసుకోవడం గమనార్హం. చైనాతో ఉన్న ఉద్రిక్తల నేపథ్యంలో తన గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవడంలో భాగంగా ఇండియా ఈ ఆధునిక రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ఎస్ -400 రక్షణ వ్యవస్థ ఒకే సారి 36 లక్ష్యాలను ఛేదించగలదు.