కరోనా సెగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా తాకింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరి ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని వచ్చిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర సచివాలయంలో కూడా కరోనా వ్యాధి తీవ్రంగా వ్యాపించిందని చాలా మంది ఉద్యోగులకు తాత్కాలికంగా సెలవులు కూడా ఇచ్చేశారు. ఇటువంటి సమయంలో జగన్ నివాసం వద్ద కరోనా కలకలం రేపుతోంది.
తాడేపల్లిలోని పది మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా వచ్చింది. వారిలో ఏపీఎస్పీ కాకినాడ బెటాలియన్ కు చెందిన ఎనిమిది మంది సెక్యూరిటీ గార్డులను పాజిటివ్ గా నిర్ధారించగా మరో బెటాలియన్ కు చెందిన ఇద్దరు పాజిటివ్ గా తేలారు. ఈ నెల 2వ తేదీన సీఎం నివాసం వద్ద గార్డులకు కరోనా టెస్టులను నిర్వహించగా వారి టెస్టుల ఫలితాలను ఈ రోజు వెల్లడించారు. ఈ ఫలితాల్లో పదిమంది కి వైరస్ నిర్ధారణ అయింది. ఇక సీఎం నివాసం వద్ద సెక్యూరిటీ గార్డులకు పాజిటివ్ అని తేలడంతో సీఎం కార్యాలయం వద్ద కలకలం చెలరేగింది.
ఇకపోతే ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు పదిహేను రోజుల విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రగతిభవన్ లో 30 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలడం మరియు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురికి కరోనా వైరస్ సోకి ఆస్పత్రి పాలుకావడం… ఇక రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఆస్పత్రి నుంచి ఈ రోజే డిశ్చార్జ్ కావడం చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లో నేతలంతా వైరస్ భయంతో వణికిపోతున్నారు.