ఇప్పుడు కేంద్రం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు సందర్భానుసారం ఒక్కొసారి ఒక్కోలా ఉంటాయ్.
భారత్ భూభాగంలోకి చైనా చొచ్చుకురావడం, గాల్వన్ లోయను ఆక్రమించుకోవాలని చేసినకుట్రలతో భారత్ కన్నేర్రజేసింది.చైనా కంపెనీలకు షాక్ ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడంతో చైనా తోకముడిచింది. పైపెచ్చు పారామిలటరీ దళాలు వినియోగించే వస్తువుల్లో చైనా నుంచి వచ్చే వస్తువులను విక్రయించరాదన్న నిర్ణయం తీసుకొని తర్వాత వెనకడుగేసింది. అయితే చైనా వస్తువుల నిషేధం, చైనా కంపెనీలను ప్రోత్సహించే విషయంలో భారత్ ప్రభుత్వం గందరగోళంగా ఉందన్న ఫీలింగ్ కలుగుతోంది.
చైనా వస్తువులు నిషేధించాలంటారు… కానీ వారికే స్పాన్సర్షిప్లు ఇస్తారు… చైనా కంపెనీలు లేకుండా భారత్ మనుగడ సాగించలేదా…? బీసీసీఐ, ఐపీఎల్ నిర్ణయంపై నిప్పులు చెరిగారు జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. భారతభూభాగంలోకి చైనా చొచ్చుకువస్తుందంటూ ఇప్పటికే టిక్ టాక్, సహా పలు యాప్లను నిషేధించిన కేంద్రం… ఐపీఎల్ విషయంలో చైనా కంపెనీల స్పాన్సర్ షిప్ ను ఎలా కంటిన్యూ చేస్తుందన్న విమర్శలకు ఒమర్ మరింత పొదునుపెట్టారు ఒమర్ అబ్దుల్లా.
ఐపీఎల్ గవర్నింగ్ బాడీ తీసుకున్న తీరు ఘోరమని, బీసీసీఐ అసలేం చేస్తుందంటూ ఆయన ప్రశ్నించారు. మొత్తంగా కేంద్రం ఎందుకు డబుల్ గేమ్ ఆడుతుందంటూ మండిపడ్డారు. ఓవైపు చైనా గూడ్స్ ను బ్యాన్ చేయాలంటూ సామాన్యులకు చెప్పే పెద్దలు… ఇలా చేయడమేంటని ఒమర్ ప్రశ్నిస్తున్నారు. చైనా ఫోన్లను కొనద్దంటారు… అదే సమయంలో చైనా కంపెనీలను ఐపీఎల్ స్పాన్సర్లుగా కొనసాగిస్తారా… ఇదేం విడ్డూరమంటూ ఆయన మండిపడుతున్నారు. చైనా భారత్ పై దురాక్రమణకు పాల్పడుతున్న సమయంలో చైనా మనీ, పెట్టుబడులు, స్పాన్సర్ షిప్లు, ప్రకటనలను ఎలా అనుమతిస్తారన్న దానికి ఐపీఎల్ సమాధానం చెప్పాలంటూ ఆయన ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని దుయ్యబట్టారు.
గత ఏడాది ఐపీఎల్ లో ప్రకటనలు ఇచ్చిన అన్ని కంపెనీలు, వివోతహా అన్నింటినీ కంటిన్యూ చేస్తున్నట్టు చెప్పడంపై ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. వచ్చేనెల 19 నుంచి నవంబర్ 10 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఐపీఎల్ నిర్వహణకు కేంద్రం అనుమతివ్వడంతో ప్రకటనదారుల ఇష్యూ మళ్లీ చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా చైనా వస్తువులు వాడొద్దంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం… కేవలం మాటలకే పరిమితమైపోయిందన్న ఆరోపణల నడుమ… ఒమర్ అబ్దుల్లా విమర్శలు కాకరేపుతున్నాయ్. చైనా వస్తువులను బాల్కనీల నుంచి విసిరిపారేసి వారు ఇప్పుడు నిషేధం గురించి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. అదే సమయంలో చైనా కంపెనీలు లేకుండా… చైనా స్పాన్సర్ షిప్ లు లేకుండా మనం బతకలేమా అంటూ ఆయన ప్రశ్నించారు.