అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు అంకుటిత దీక్ష, పట్టుదలతో కృషి చేశారు దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందనరావు. చట్టసభలోకి అడుగు పెట్టాలన్న తన ఆకాంక్ష, కోరిక మూడవ ప్రయత్నంలో సఫలం చేసుకున్నారు. ఈ సందర్భంగా రఘునందనరావు ఎమ్మెల్యేగా గెలుపొందే వరకూ ఆయన వివరాలు క్లుప్తంగా..
జర్నలిస్ట్గా ప్రస్థానం ప్రారంభించి..
మెదక్ జిల్లాలో 1968 మార్చిలో జన్మించిన రఘునందనరావు .. సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఎల్ఎల్బీ, కర్నాటక విశ్వ విద్యాలయం నుండి బీఈడీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుండి మానవహక్కులలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. విద్యాభ్యాసం అనంతరం రఘునందనరావు 1991ల తన మకాంను సిద్దిపేట నుండి హైదరాబాద్ లోని పటాన్చెరువు ప్రాంతానికి మారారు. అయిదేళ్ల పాటు ఒక ప్రముఖ దిన పత్రికకు విలేఖరిగా పని చేశారు. ఆ తదుపరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పని చేశారు. ఆ కాలంలో ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీకి న్యాయవాదిగా వివిధ కేసుల్లో వ్యవహరించారు.
టీఆర్ఎస్తో రాజకీయ అరంగ్రేటం
రఘునందనరావు 2001లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తన వాగ్దాటి, నాయకత్వ పటిమతో కార్యకర్త నుండి నాయకుడిగా ఎదిగారు. మెదక్ జిల్లా అధ్యక్షుడుగా, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడుగా పని చేశారు. కేసిఆర్ కుటుంబానికి దగ్గర బంధువు అయినప్పటికీ హరీష్ రావుతో విబేధాల కారణంగా పార్టీ నుండి బహిష్కరించారని టాక్. 2013లో టీడీపీ అధినేత చంద్రబాబు ను కలిశారన్న ఆరోపణపై రఘునందనరావును టీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. టీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన తరువాత రఘునందనరావు బీజేపీలో చేరారు.
పట్టువదలని విక్రమార్కుడిలా
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014 ఎన్నికల్లో ఆ తరువాత 2018 ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థిగా రఘునందన రావు పోటీ చేశారు. నాడు ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు రఘునందనరావు. మూడవ స్థానానికి పరిమితం అయ్యారు. 2014 ఎన్నికల్లో 15,131 ఓట్లు సాధించిన రఘునందనరావు, 2018 ఎన్నికల్లో మరో ఆరు వేల పైచిలుకు ఓట్లు ఎక్కువగా 22,595 ఓట్లు మాత్రమే పొందారు. ఆ రెండు పర్యాయాలు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ఇక్కడ నుండి విజయం సాధించారు. రెండవ సారి ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఇదే నియోజకవర్గం నుండి రెండు సార్లు ఓటమి పాలైనా నిరుత్సాహ పడకుండా ఓర్పు నేర్పుతో నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు రఘునందనరావు. ఈ సారి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతను నిలిపి గెలుపు బాధ్యతలను మంత్రి హరీష్ రావు స్వీకరించి అన్నీ తానే అయి వ్యవహరించారు. అయినప్పటికీ రఘునందనరావు ఏమాత్రం భయపడకుండా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందు నుండే నియోజకవర్గంలోని గ్రామాలు అన్నీ ఒక సారి చుట్టేశారు. ప్రజల కష్టాలు, బాధలు వింటూ రెండు సార్లు తిరస్కరించారు ఈ సారి అయినా అవకాశం ఇవ్వండి అంటూ ఊరుఊరు తిరిగారు. గడపగడప ఎక్కారు. ఓట్లు అభ్యర్థించారు. ఆయన కష్టం ఫలిచింది. వెయ్యి ఓట్లకు పైగా ఆధిక్యతతో దుబ్బాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు రఘునందనరావు.