GHMC Mayor : టీఆర్ఎస్ బీజేపీ.. మధ్యలో ఎంఐఎం..! ఇదేదో సినిమా టైటిల్ లా అనిపించినా ప్రస్తుతం ఈ పార్టీలను ఇలానే ఉచ్చరించాలి తప్పదు.జీహెచ్ఎంసీ మేయర్ GHMC Mayor ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు అలా మారిపోయాయి మరి. ఎందుకంటే నీతులు చెప్పడానికే.. పాటించడానికి కాదు, సూక్తులు చదవడానికే.. ఆచరించడానికి కాదు. వాడుకలో ఉన్న ఈ నీతి సూత్రాలన్నీ మన రాజకీయ నాయకులకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి.
ఎవరెప్పుడు ఎటు వెళ్తారో, ఏ పార్టీలో ఉంటారో.. ఎవరికి మద్ధతిస్తారో.. అన్నింటికీ మించి ఎవరిని ఎప్పుడు తిడతారో ఎవరికీ తెలీదు. ఇదంతా ఇప్పుడు ప్రత్యేకించి చెప్పుకోవడానికి కారణమైన పార్టీలు టీఆర్ఎస్-ఎంఐఎం. గత ఏడాది జరిగిన బీహార్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు ఆడిన మూడు ముక్కలాట ఇది. అప్పట్లో తిట్టుకుని ఇప్పుడు కలిసిపోయారు. ఎవరో.. ఏంటో.. ఎందుకో చదవండి..
GHMC Mayor : రాజకీయ నానుడిని నిజం చేసేలా..
‘రాజకీయాల్లో శాస్వత శత్రువులు.. శాస్వత మిత్రులు ఉండరు..’ చత్రపతి సినిమాలో కోట శ్రీనివాసరావు డైలాగ్ ఇది. రాజకీయాల్ని చూసేవారికి.. అందులో ఉన్న వారికి ఇది తెలిసిన విషయమే. స్వయంగా చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నట్టు అన్నమాట. సగటు మనిషి ఊహించలేని రాజకీయ ఆట ఇది. ఈస్థాయి పెర్ఫార్మెన్సే ఎంఐఎం చేసింది. అదీ ముసుగులో. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి 5 సీట్లు గెలుచుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడ్డ మహా ఘట్ బంధన్ కు షాక్ ఇస్తూ.. ఎంఐఎంతో కలిసి బీజీపీ ఆడిన గేమ్.. అంతా పూర్తయ్యకే తెలిసింది. బీజేపీతో-జనతాదళ్ కు ఎంఐఎం ఓట్లు చీల్చిపెట్టి మహా ఘట్ బంధన్ కు అధికారం దూరం చేసి బీజేపీ కూటమికి అధికారం అప్పగించింది. పైకి బీజేపీతో ఢీ.. లోపల బీజేపీతో దోస్తీ. ఇదే స్ట్రాటజీని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం మళ్లీ చేసింది. ఏకంగా మతపరమైన అంశాలని ప్రచారంలో తీసుకొచ్చి బీజేపీతో నువ్వా నేనా అనేంత వరకూ వెళ్లింది హైదరాబాద్ లో. మొత్తంగా ఎన్నికల్లో బీజేపీకి సాయం చేసి.. ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్ కు సాయం అందించింది. అదెలా అంటే..
బీహార్, హైదరాబాద్ లో ఇలా..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీ నేతలు దూషించుకున్న తీరు చూస్తే.. మళ్లీ హైదరాబాద్ ఏమైపోతుందో.. ఏం జరుగుతుందో అనే అనుకున్నారు అంతా. అంతలా మాటల దాడి జరిగిపోయింది. అయితే.. ఇదంతా వీరిద్దరూ కలిసి ఆడిన గేమ్ అని తెలుసుకోవడానికి కాస్త సమయమే పట్టింది. మతపరమైన ఓట్లు ఎవరివ వారికి వచ్చేట్టు.. ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ముస్లిం ఓట్లు ఎలానూ ఎంఐఎంకే వెళ్తాయి. అయితే.. హిందూ ఓట్లు చీల్చడమే లక్ష్యంగా మతపరమైన అంశాల్ని తీసుకొచ్చి వాటిని బీజేపీ ఢీకొట్టినట్టు చూపారు. దీంతో హిందూ సెంటిమెంట్ రగిలి బీజేపీకి, ముస్లిం సెంటిమెంట్ రగిలి ఎంఐఎంకు ఓట్లు పడ్డాయి.. సీట్లు పెరిగాయి. ఇద్దరికీ లాభమే జరిగింది. అయితే.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచీ టీఆర్ఎస్ తో మైత్రి కొనసాగించిన ఎంఐఎం మాత్రం కాస్త ఎదగాలని చూసి బీజేపీతో సావాసం చేసింది. ఇక్కడ టీఆర్ఎస్ ను వదులుకోలేదు.. అక్కడ బీజేపీని కాదనలేకుండా ప్లాన్ ప్రకారంగా ఎదిగింది.
రెండు చోట్ల గ్రిప్.. వాట్ ఏన్ ఐడియా
ఇక్కడ టీఆర్ఎస్ తో బంధం ఏంటో ఈరోజు నిరూపణ అయింది. ప్రతిష్టాత్మక జీహెచ్ఎంసీ మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్, బీజేపీ పోటీ పడ్డాయి. మొత్తంగా కె.కేశవరావు కుమార్తె టీఆర్ఎస్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి, మరో టీఆర్ఎస్ కార్పొరేటర్ మోతె శ్రీలత డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. మొత్తంగా రెండు పదవుల్లో బీజేపీకి ఒక్కటీ దక్కలేదు. ఇక్కడ మళ్లీ చక్రం తిప్పింది ఎంఐఎం. మేయర్ ఎన్నికల ముందు, ఎంఐఎం వంటి ఇస్లామిక్ మతోన్మాద మతతత్వ పార్టీ మాకు పొత్తు లేదని.. ఉంటే నిరూపించాలని సవాలు చేసింది. కానీ.. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల విషయంలో ఎంఐఎం మద్దతు తీసుకుని మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు పొందింది. దీంతో ఎంఐఎం గేమ్ అందరికీ క్లియర్ అయింది.
కేంద్రంలో బీజేపీతో తగువు లేకుండా.. రాష్ట్రంలో టీఆర్ఎస్ తో తెగతెంపులు లేకుండా అధికార పార్టీలతో పావులు కదిపి ఎక్కాలనుకున్న మెట్టు ఎక్కింది.. బీహార్లో బీజేపీని పట్టు తప్పనివ్వకుండా చక్రం తిప్పింది.. జీహెచ్ఎంసీలో పట్టు కోల్పోకుండా మేయర్ పీఠంపై టీఆర్ఎస్ ను కూర్చోబెట్టింది. మొత్తంగా మూడు ముక్కలాట ఆడేసింది. విపక్షాల వాగ్భాణాలు ఎంఐఎం, టీఆర్ఎస్ పై వస్తున్నా.. మరో అయిదేళ్ల వరకు వీరికి అవి కనబడవు.. వినబడవు.