APS RTC : ఏపిఎస్ ఆర్టీసీ చాలా కాలంగా నష్టాల్లో నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటం ఆర్టీసీకి మరింత భారం అవుతోంది. లీటర్ డీజిల్కి ఒక్క రూపాయి పెరిగితే నెలకు ఎకంగా రూ.2.4 కోట్ల అదనపు భారం పడుతుంది. ఆర్టీసీ కార్మికులకు బకాయిలను చెల్లించలేని పరిస్థితిలో ఉంది. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుండేవారు. అయితే ఆర్టీసీ భారీ నష్టాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారు. తెలంగాణలో అక్కడి ఆర్టిసీ కార్మికులు ఇదే డిమాండ్ చేసినా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పేశారు. ఏపి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కెసిఆర్ తప్పుబట్టారు. కానీ ఏపి సీఎం జగన్ మాత్రం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టిసి కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
ప్రస్తుతం ఏపిఎస్ ఆర్టీసీ రూ.6వేల కోట్ల నష్టాల్లో ఉంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండి ఆర్పీ ఠాకూర్ స్వయంగా వెల్లడించారు. నేడు తూర్పు గోదావరి జిల్లాలో ఆయన మీడియా మీట్ నిర్వహించారు. డీజిల్ ధరలు పెరిగినందున ఇంధనం పొదుపు చాలా అవసరమని అన్నారు. ఆర్టీసీలో ఖర్చులు తగ్గించడంతో పాటు సిబ్బంది కష్టపడి పని చేసి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు. కార్మికులకు రావాల్సిన బకాయిలను త్వరలో విడుదల చేస్తామని ఈ సందర్భంగా హామీ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంలోనే ఆర్టీసీ కార్గో సిబ్బంది తమ సమస్యలపై ఠాకూర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కార్గో సిబ్బందికి గత మూడు నెలలుగా జీతాలు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆర్పీ ఠాకూర్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని వెల్లడించారు.