Adani : భారతదేశంలో ఈ మధ్య కాలంలో అంబానీ, అదాని పేర్లు మారుమోగినంతగా… మరే ఇతర వ్యాపారవేత్త పేరు కూడా బయటకు రాలేదు. ఇక పలు పోర్టులు, ఎయిర్పోర్టులు, కోల్ మైన్స్, పవర్ ప్లాంట్ లకు అధినేత అయిన భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదాని ఒక అరుదైన రికార్డు సాధించాడు.
కరోనా వచ్చి ప్రపంచం తలకిందులు అయిపోయినా… అతని సంపాదన మాత్రం రాకెట్ లాగా దూసుకుపోయింది. 2021లో ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జించిన అపరకుబేరుడు గా రికార్డు సాధించాడు అదాని. ప్రపంచ నెంబర్ వన్ ధనికులైన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, టెస్లాస్ అధినేత ఎలాన్ మస్క్ ఆదాయాన్ని మించి ఈ సంవత్సరం అదాని సంపాదించాడని బ్లూమ్ బెర్గ్ ఇండెక్స్ తెలిపింది. ఈ ఏడాదిలో అత్యంత ఆదాయం ఆర్జించిన ప్రపంచ కుబేరుల అందరినీ అదాని పక్కకినెట్టడం విశేషం.
ఆయన గ్రూపులకి చెందిన వివిధ రంగాల షేర్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానానికి విపరీతంగా పోటీ పడుతున్న జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ కంటే ఈ సంవత్సరం అదాని ఎక్కువ సంపాదించడం అనేది చిన్న విషయం కాదు. 2021 లోనే అదాని సంపద 16.2 బిలియన్ డాలర్ల నుండి 50 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది.
ఇదే సమయంలో భారత్ కు చెందిన ముఖేష్ అంబానీ సంపద 8.1 బిలియన్ డాలర్లు పెరిగింది. అంబానీ ప్రస్తుతం ఆసియా ఖండంలోనే అత్యంత ధనికుడు. అదాని గ్రూప్ కు చెందిన షేర్లలో ఒకటి మినహాయిస్తే మిగతా 50 శాతం పైగా దూసుకెళ్లడంతో ఆ సంస్థ ధనం ఈ స్థాయిలో పెరిగింది.