అమరావతి: జనసేనలో అకస్మాత్తుగా కుదుపు. శనివారం అర్ధరాత్రి సిబిఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ జనసేన కార్యాలయానికి వెళ్లి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ను కలిశారనగానే మీడియా వర్గాలలో కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం. ఏం జరుగుతోంది? అర్ధరాత్రి చర్చలు లక్ష్మీనారాయణను మరుసటి రోజు జనసేన పార్టీలో చేర్చాయి.
లక్ష్మీనారాయణ చేరిక జనసేనకు మంచి ఊపు తెస్తుందనడంలో సందేహం లేదు. పవన్ కల్యాణ్ తాను పార్టీ పెట్టిన తర్వాత రాబట్టగలిగిన వారిలో లక్ష్మీనారాయణే పెద్ద వ్యక్తి. పవన్ అన్నయ్య చిరంజీవి పదేళ్ల క్రితం ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు ఒక స్థాయి నాయకులు చాలామంది అందులో చేరారు. అందుకు భిన్నంగా పవన్ కల్యాణ్ జనసేనలో చేరిన వారిలో ఒక్క మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తప్ప చెప్పుకోదగిన వారు లేరు.
ఇప్పుడు లక్ష్మీనారాయణ వచ్చి చేరడంతో సీన్ మారింది. ఒక్కడేగా అన్న ప్రశ్న రావచ్చమో గానీ, అత్యంత నిజాయితీపరుడిగా లక్ష్మీనారాయణకు రాష్ట్రంలో ఉన్న పేరు తక్కువది కాదు. పవన్ను సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ‘ఇంకో హీరో’ కింద కొట్టిపారేసే వారు కూడా ఆయన చిత్తశుద్ధిని శంకించలేరు. ఇప్పటికిప్పుడు పవన్, లక్ష్మీనారాయణ కాంబినేషన్ జనసేనకు ఎన్ని సీట్లు సాధించిపెట్టగలదో చెప్పలేకపోయినా, ఇప్పటికి అది హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.
లక్ష్మీనారాయణ తర్వాత ఎవరు?
జనసేనలోకి మరిన్ని చేరికలు ఉండే అవకాశం కనబడుతోంది. కాపులకు బిసి గుర్తింపు కోసం పోరాడుతున్న సీనియర్ రాజకీయవేత్త, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా జనసేనలో చేరే అవకాశం ఉందంటున్నారు. కాపులకు బిసి గుర్తింపు అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన ముద్రగడను టిడిపిలోకి చేర్చేందుకు ఒక ప్రయత్నం జరిగింది. కేంద్రం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ప్రకటించిన పది శాతం రిజర్వేషన్లలో అయిదు శాతాన్ని రాష్ట్రంలో కాపులకు ప్రకటించిన తర్వాత ఈ ప్రయత్నం జరిగింది. అయితే ముద్రగడ టిడిపిలో చేరేందుకు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఆయనను జనసేనలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే అటు టిడిపి, ఇటు వైసిపి అభ్యర్ధుల జాబితాలను ప్రకటించాయి. వైసిపి పూర్తి జాబితాను ప్రకటించగా, టిడిపి ఇంకా 34 అసెంబ్లీ స్థానాలకు, మొత్తం 25 లోక్సభ స్థానాలకూ అభ్యర్ధుల పేర్లు ప్రకటించాల్సి ఉంది. ఆ పార్టీలలో చోటు దక్కని వారు కొందరు జనసేనలో అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది.