Bharathi Cements: “పాలన అంటే పరిశ్రమలు నెలకొల్పాలి. అవకాశాలు సృష్టించాలి. ఉపాధి అవకాశాలు కల్పించాలి. పెట్టుబడులను ఆహ్వానించాలి. కొత్త కొత్త మార్గాలని అన్వేషించాలి. సీఎం జగన్ ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. గడిచిన ఏడాదిన్నరగా అనేక కంపెనీలతో చర్చలు జరుపుతూ.., పారిశ్రామిక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తరుణంలో ఆయన సొంత జిల్లాలో ఉన్న కంపెనీ వెళ్ళిపోతే అది రాష్ట్రానికే పరాభవం. తలమానికం. కష్టకాలం..!
Bharathi Cements: జువారీ సిమెంట్స్ కి మూసివేత నోటీసుతో వివాదం..!
భారతి సిమెంట్స్ అందరికీ తెలిసిందే. ఈడీ, సీబీఐ కేసుల వరకు కొన్ని వివాదాల్లో ఉంది.. ఇప్పుడు తన అధికారంతో ఈ కంపెనీని విస్తరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదేమి తప్పు కాదు. అయితే ఒక రాజకీయ నాయకుడి కంపెనీ అయినప్పుడు దానిపై కొన్ని కళ్ళు ఉంటాయి.. లేనిపోని ఆరోపణలు వస్తుంటాయి. ఇప్పుడు భారతి సిమెంట్స్ పై .. ప్రతిపక్షాలు కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి. ఆ జిల్లాలో వినిపిస్తున్న పెద్ద ఆరోపణ. కడప జిల్లాలోనే ఉన్న మరో పెద్ద సిమెంట్ కంపెనీ “జువారి సిమెంట్స్”కి ఈ కంపెనీకి ఇటీవల చుక్కలు కనిపిస్తున్నాయి.
* జగన్ అధికారంలోకి వచ్చాక భారతి రెడ్డి చైర్మన్ గా ఉన్న భారతి సిమెంట్స్ జువారీ సిమెంట్స్ లో వాటా తీసుకోవాలి అనుకున్నారని.., అది జరగని కారణంగా ఇప్పుడు జువారీ సిమెంట్స్ కంపెనీని వేధిస్తున్నారని ఇటీవల కొన్ని ఆరోపణలు మొదలయ్యాయి. నిజానికి భారతి సిమెంట్స్ – జువారీ మధ్య మొదట్లో చర్చలు కూడా జరిగాయి. కానీ ఏకాభిప్రాయం రాలేదు. అప్పటి నుండి ప్రయత్నాలు జరుగుతున్నా అంగీకరించడం లేదు. తాజాగా రెండు రోజుల కిందట “జువారీ సిమెంట్స్” పరిశ్రమ మూసేయాలి అంటూ కాలుష్య నియంత్రణ శాఖ నోటీసులు. జువారీ ప్లాంట్ కి విద్యుత్ సరఫరా ఆపేయాలని విద్యుత్ సరఫరా ట్రాన్స్కో పర్యవేక్షక ఇంజనీర్ కి ఆదేశాలు జరీ చేశారు. ఇక్కడితో టీడీపీ తమ ఆరోపణలకు పదును పెట్టింది.
ఇదే పెద్ద కంపెనీ..! ఒకవేళ మూసేస్తే..!?
కడప జిల్లా యర్రగుంట్ల మండలం కృష్ణా నగర్ లో జువారే సిమెంట్ పరిశ్రమ ఉంది. 1998 నుండి నడుస్తుంది. ఏడాదికి 4500 మెట్రిక్ టన్నులు సిమెంట్ ఉత్పత్తి జరుగుతుంది. దాదాపు 3 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ అయినా హేడెల్బర్గ్ సిమెంట్ కంపెనీలో ఇదీ ఇక భాగం. రాష్ట్రంలో ఇదే పెద్దది. అత్యధిక సామర్ధ్యం ఉన్న సిమెంట్ కంపెనీ. ప్రస్తుతం ఉత్పత్తిలో చూసుకుంటే ఇది మంచి పేరున్న కంపెనీ. అదే కడప జిల్లాలో భారతి సిమెంట్స్ ఏర్పాటయింది. 2008 లో వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు రఘురాం సిమెంట్స్ లో వాటాలు కొనుగోలు చేయడం ద్వారా… భారతి సిమెంట్స్ ఏర్పాటయింది. ఆ తర్వాత 2010 లో వీ సెట్ అనే అంతర్జాతీయ కంపెనీలో 51 శాతం వాటాలు కొనుగోలుతో భారతి సిమెంట్స్ ఉన్నత స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఆ కెంపెనీ సామర్ధ్యం ఏడాదికి 5 మెట్రిక్ టన్నులు.
* తాజాగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నోటీసులతో జువారీ సిమెంట్స్ కోర్టుకి వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ఈ గొడవ ఇప్పటికే కడప మొత్తం పాకింది. ఇది మొత్తం పాకి, రచ్చగా మారితే అది ప్రభుత్వానికి ఇబ్బందికర అంశమే. అందుకే ఈ జువారీ సిమెంట్స్ కంపెనీ కాలుష్యం అధికంగా ఉంటె.. నిబంధనలు మేరకు నడుచుకోకుంటే… స్థానికంగా కొన్ని ఫిర్యాదులు స్వీకరించి.. బహిరంగ విచారణ చేపట్టి.. స్థానికుల అభిప్రాయం మేరకు అనే వంకలతో కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. అలా కాకుండా నేరుగా నోటీసులు ఇస్తే వ్యవహారం ఇలాగే ఉంటుంది.. వివాదాల్లో దూరడం .. దాన్ని రాజకీయం చేయడం విపక్షాలకు అలవాటే. కానీ ఇక్కడ జగన్ సొంత కంపెనీ పై ఇటువంటి ఆరోపణలు వస్తుండడం.. దానికి బలం చేకూరేలా మొన్న నోటీసులు కూడా వెళ్లడంతో విషయం పెద్దదవుతుంది.