Chandra Babu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కర్నూలు కేంద్రంగా ఎన్ 440కే అనే కొత్త కరోనా వైరస్ వేరియంట్ పుట్టిందనీ, అది తొలి కరోనా వైరస్ కన్నా పది నుండి 15 రెట్ల తీవ్రతతో వ్యాప్తి చెంది మానవ నష్టం కల్గిస్తుందంటూ ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాసుపోగు సుబ్బయ్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. చంద్రబాబుపై కేసు నమోదు చేయడంతో ఆయనను ఈ కేసులో అరెస్టు చేస్తారా లేదా విచారణకు పిలుస్తారా అనే విషయాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఈ తరుణంలో చంద్రబాబు అరెస్టు చేసే విషయంపై కర్నూలు జిల్లా ఎస్పీ ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప క్లారిటీ ఇచ్చారు. ఎన్ 440 కే వైరస్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుకు నోటీసులు ఇస్తామని చెప్పారు. రేపు సాయంత్రం నోటీసు జారీ చేసి ఏడు రోజుల్లోగా విచారణకు హజరు కావాలని కోరతామన్నారు. ఈ కేసు విషయంపై శాస్త్రీయంగా దర్యాప్తును జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రబాబును అరెస్టు చేసే విషయంపై ఐఒ (ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్) తగిన నిర్ణయం తీసుకుంటారని ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.
అయితే ఏడేళ్ల లోపు జైలు శిక్ష విధించే కేసులకు సంబంధించి అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల నేపథ్యంలో చంద్రబాబును విచారణకు పిలిచిన సందర్భంలోనే స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. లేకుంటే చంద్రబాబే స్వయంగా ఈ కేసుపైన హైకోర్టును ఆశ్రయిస్తారనే మాట కూడా వినబడుతోంది.