MK Stalin: ఓ పక్క దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రాల్లో కర్ఫ్యూ, లాక్ డౌన్ లాంటి కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. కోవిడ్ నివారణ చర్యల విషయంలో పలు రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. అయితే తమిళనాడులో అందుకు భిన్నంగా వాతావరణం ఉంది. ఇటీవలే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ గత రాజకీయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
Read More: Etela Rajender: బీజేపీలో చేరిక అంశంపై ఈటెల క్లారిటీ ఇది..!!
కీలక నిర్ణయాలను తీసుకుంటూ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్నారు. కరోనా నివారణ చర్యలకు సంబంధించి ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా అందులో ప్రతిపక్ష పార్టీలకు అధిక భాగస్వామ్యం ఇచ్చారు. తమిళనాట ఎప్పుటూ ఉండే కక్షసాధింపు చర్యలకు స్వస్తి పలికారు. దివంగత సీఎం జయలలిత హయాంలో ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటిన్ లను యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శ ప్రాయంగా ఉంటున్నాయి అంటున్నారు.
అదే విధంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందే కరోనా రోగులకు సంబంధించి మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ప్రస్తుత కరోనా లాక్ డౌన్ కాలంలో రాష్ట్రంలోని పేద వర్గాలకు రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఇప్పుడు తాజాగా జర్నలిస్ట్ ల సంక్షేమానికి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు స్టాలిన్.
తమిళనాడులో కరోనా కారణంగా మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకునేందుకు రూ.10లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అదే విధంగా బాధిత జర్నలిస్ట్ లకు రూ. 5వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఇలా స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తున్న వారు స్టాలిన్ది ఎంత దొడ్డ (పెద్ద) మనసో అంటూ కీర్తిస్తున్నారు. ఇటువంటి నిర్ణయం దేశంలో ఇంత వరకూ ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదని జర్నలిస్ట్ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.