Minor Girl Kidnapped: మనువడు, మనవరాలిపై ఉన్న ప్రేమతో ఓ వృద్ధురాలు నేరానికి ఓడిగట్టింది. మనవడికి మనువరాలిని ఇచ్చి పెళ్లి చేయాలన్న కోరికతో మైనార్టీ తీరని యువతిని స్వయంగా అమ్మమ్మే కిడ్నాప్ చేయించడం తీవ్ర సంచలనం అయ్యింది. కూమార్తె కిడ్నాప్ పై తల్లి ఫిర్యాదు చేయడంతో ఆమె తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
విషయంలోకి వెళితే…చిత్తూరు పట్టణానికి చెందిన లక్ష్మి అనే గృహిణి భర్తతో విబేధాలు రావడంతో కుమార్తెను తీసుకుని జీవనాధారం కోసం తిరుపతి సమపంలోని తిరుచానూరుకు ఆరేళ్ల క్రితం వెళ్లింది. అక్కడ కూలీ నాలి పనులు చేసుకుంటూ కుమార్తెను చదివించుకుంటూ జీవనం సాగిస్తోంది. తన 14 ఏళ్ల కుమార్తె చదువులో మంచి రాణిస్తుండటంతో ఉన్నత చదువులు చదివించాలని భావించింది. లక్ష్మి అమ్మ ఓబుళమ్మ, అన్న వదినలు ఆదినారాయణ, లింగయ్యలు చిత్తూరులోనే ఉంటున్నారు. లక్ష్మి అన్న కుమారుడు మురళి కృష్ణ (27) బెంగళూరులో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మురళీకృష్ణకు ఇంకా వివాహం జరగకపోవడంతో లక్ష్మి కుమార్తెను మురళీ కృష్ణకు ఇచ్చి వివాహం చేయాలని లక్ష్మి తల్లి ఓబుళమ్మ, అన్న వదినలు తీవ్ర ఒత్తడి తీసుకువచ్చారు. అయితే తన కుమార్తె బాగా చదువుతోందనీ, ఇప్పుడే వివాహం చేసే ఉద్దేశం తనకు లేదనీ, మైనార్టీ కూడా తీరకముందే వివాహం ఏమిటని తల్లి లక్ష్మి కరాఖండిగా చెప్పేసింది.
మనవరాలిని మనువడికి ఇచ్చి పెళ్లి చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్న లక్ష్మి తల్లి ఓబుళమ్మ సొంత మనువరాలినే కిడ్నాప్ చేయాలని పథకం రచించింది. ఈ నెల 6వ తేదీన లక్ష్మి ఇంట్లో లేని సమయంలో మనువరాలిని కిడ్నాప్ చేసింది. కాగా పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన లక్ష్మికి కుమార్తె కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారిని వాకబు చేయగా ఎవరో వచ్చి తీసుకువెళ్లినట్లు తెలియడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాధమిక సమాచారం మేరకు బాలిక అమ్మమ్మ ఓబుళమ్మ, మేనమామ ఆదినారాయణ, అత్త లింగమ్మ, బావ మురళీ కృష్ణ లపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. వీరు పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని మైనర్ బాలికను తల్లి వద్దకు చేరుస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.