Somu Veerraju: ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్రంలోని మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ క్వార్టర్ రూ.75లకు అందిస్తామని హామీ ఇచ్చారు. కుదిరితే రూ.50లకే మంచి లిక్కర్ తయారు చేసి ఇస్తారట. ప్రస్తుతం రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచేది మందు బాబులను దోచేస్తుందట. అందుకే మందు బాబులపై సోము సారుకు చాలా ప్రేమ వచ్చి పడింది. తక్కువ ధరలే లిక్కర్ అందిస్తామని హామీ ఇచ్చారు సోము వీర్రాజు సారు.
తాము అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామనో, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేస్తామనో, రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామనో, ఎరువులు, పురుగు మందుల ధరలు సరసమైన ధరలకు లభించేలా చూస్తామనో, మహిళల స్వయం ఉపాధి బాటలు వేస్తామనో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామనో హామీలు ఇస్తే కొంత గౌరవ ప్రదంగా ఉండేది. ఉట్టికి ఎగరలేన్నమ్మ ఆకాశానికి ఎగురుతా అన్నదట. అలానే ఉంది సోమూ సారు తీరు.
Somu Veerraju: చీప్ లిక్కర్ క్వార్టర్ రూ.75 లకే ఇచ్చేస్తా
రాష్ట్రంలో ఒక్క మున్సిపాలిటీ, ఒక్క పంచాయతీ లో పూర్తి స్థాయిలో మెజార్టీ లేదు. ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేస్తాం, తామే అధికార పార్టీకి ప్రత్యామ్నాయం అని పగటి కలలు కంటోంది. చీప్ లిక్కర్ క్వార్టర్ రూ.75 లకే ఇచ్చేస్తామంటూ సోము సారు వాగ్దానం చేసేస్తున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఆ మాదిరిగా తక్కువ ధరలకు లిక్కర్ అమ్ముతున్నారా ? ఒక వేళ అమ్మితే ఫలానా రాష్ట్రంలో మా బీజేపీ ప్రభుత్వం ఇంత తక్కువ ధరకు లిక్కర్ అమ్ముతుంది అని చెప్పుకోవచ్చు. సోము సారు చెప్పిన లిక్కర్ ధరలు ఒక్క కేంద్ర పాలిత ప్రాంతాల్లో మినహా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండకపోవచ్చు. అందుకే సోము సారు వ్యాఖ్యలను ఫన్నీ కామెంట్స్ గా నవ్వుకుంటుంటారు.