Pawan Kalyan: ఏపిలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండి రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాజకీయ పార్టీల పొత్తులపై ఇప్పటి నుండి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పొత్తులకు సంబంధించి జనసేన ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయని అన్నారు. 1. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించడం. 2. బీజేపీతో పాటు టీడీపీని కూడా కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించడం. 3. జనసేన ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించడం. ఈ మూడు ఆప్షన్లు తమ ముందు ఉన్న అవకాశాలుగా పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Pawan Kalyan: పొత్తుల మధ్య ఐక్యతతోనే విజయం
రాబోయే ఎన్నికల్లో విజయం అనేది పొత్తుల మధ్య ఐక్యతపై అధారపడి ఉంటుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. 2014 లో రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ, టీడీపీతో కలిసి విజయం సాధించామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన చాలా సార్లు తగ్గిందని ఇప్పుడు మిగతా పార్టీలు తగ్గితే బాగుంటుంది అన్నట్లుగా పరోక్ష వ్యాఖ్యలు వేశారు. “తనకు తాను తగ్గించుకున్న వాడే హెచ్చింపబడును” అని బైబిల్ లో సూక్తి ఉందనీ, ఈ సూక్తిని టీడీపీ నేతలు పాటించాలని కోరుతున్నానన్నారు.
పొత్తుల అంశం జనసైనికులు సీరియస్ గా తీసుకోవద్దు
జనసేన పార్టీ ఎప్పుడూ తగ్గే ఉంటుందని పేర్కొన్న పవన్ కళ్యాణ్.. పొత్తుల విషయాన్ని జనసేన శ్రేణులు తీవ్రంగా పరిగణించవద్దని సూచించారు. ఈ సారి ప్రజలే విజయం సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. పవర్ షేరింగ్ కి టీడీపీ అంగీకరించాలని పరోక్షంగా చెబుతూనే జనసైనికులు ఈ అంశంలో పట్టుదలగా ఉండవద్దు అన్నట్లుగా సూచించినట్లు ఉందని భావిస్తున్నారు.