తెలుగు రాష్ట్రాల్లో శ్రీ శోభకృత్ నామ ఉగాది పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహనరెడ్డి, కేసిఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర పార్టీలు, నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు శుభాలు చేకూరాలని, రాష్ట్రాలతో పాటు దేశం అభివృద్ధి చెందాలని ప్రముఖులు ఆకాంక్షించారు.
ప్రధాని మోడీ: “అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కొత్త ఆశలు, కొత్త ఆరంభాలతో ముడిపడి ఉన్న ఉత్సాహభరితమైన పండుగ ఇది. రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో అమితమైన ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీ తీసుకురావాలని ప్రార్ధిస్తున్నాను” అని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
అమిత్ షా: “మన తెలుగు సోదర సోదరీమణులకు నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితాలలో శాంతి మరియు శ్రేయస్సును కలిగించాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్: రాష్ట్ర ప్రజలందరికీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శోభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలని, రైతులకు మేలు కలగాలని, నా అక్క చెల్లెమ్మలు ఆనందంగా ఉండాలని, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను అని సీఎం జగన్ తెలిపారు.
కేసిఆర్: రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ శోభకృత్ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణ లో నిత్య వసంతం నెలకొన్నదని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి, తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టమైందని అన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. శోభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని సీఎం కేసిఆర్ ఆకాంక్షించారు.
చంద్రబాబు: తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మనందరం శోభకృత్ నామ తెలుగు సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఏపి ప్రజల జీవితాల్లో కొత్త ఏడాది పెనుమార్పులు తేబోతుంది. రాష్ట్రానికి శుభసూచకం. శుభప్రదమైన ఆ మార్పును స్వాగతిద్దామని చంద్రబాబు ఆకాంక్షించారు. తెలంగాణ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ టీపీ అదినేత్రి వైఎస్ షర్మిల, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితర ప్రముఖులు తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
ఉగాది పండుగ వేళ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్