(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
గుంటూరు జిల్లాలో పల్నాటి ముఖద్వారమైన సత్తెనపల్లి నియోజకవర్గ ఎన్నికల ఫలితంపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ప్రధాన పార్టీలతో పాటు కాంగ్రెస్, బిజెపి తదితర ఇండిపెండెంట్ అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ ప్రధానంగా టిడిపి, వైసిపి,జనసేన మధ్యనే ముక్కోణపు పోటీ జరిగిందని చెప్పవచ్చు.
పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరు స్థానికేతరులే. ఈ కారణంగా కొందరు టిడిపి నేతలు కోడెల శివప్రసాద్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేయగా అంబటి రాంబాబు అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీలోని కొందరు నాయకులు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు. అయినప్పటికీ ఆయా పార్టీల అధిష్టానాలు వీరి అభ్యర్థిత్వాలనే ఖరారు చేశారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయానికే వస్తే పార్టీ ఆవిర్భావం నుండి నర్సరావుపేట నియోజకవర్గం నుండి వరుసగా ఐదు పర్యాయాలు విజయం సాధించిన కోడెల శివప్రసాద్ ఉమ్మడి రాష్ట్రంలో హోంశాఖ, నీటిపారులదల శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004,2009 ఎన్నికల్లో రెండు సార్లూ నర్సరావుపేట నుండి పరాజయం చవిచూడటంతో 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుండి పోటీ చేసి వైసిపి అభ్యర్థి అంబటి రాంబాబుపై కేవలం 924 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అనంతరం శాసనసభ స్వీకర్గా ఎన్నికై కొనసాగుతూ వచ్చారు. కోడెలకు వైద్యుడుగా, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేశాడని మంచి పేరు ఉన్నప్పటికీ ఆయన కుమారుడి వల్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత కూడా ఉందని చెబుతున్నారు.
వైసిపి అభ్యర్థి అంబటి రాంబబు విషయానికి వస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎపిఐసిసి చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీని వీడి వైసిపిలో చేరారు. పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి సన్నిహితంగా ఉండటంతో 2014లో సత్తెనపల్లి నుండి పోటీ చేసే అవకాశం కల్పించారు. అయితే స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఆయన వాగ్దాటికి మెచ్చి పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడంతో వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను మీడియా సమావేశాల్లో గట్టిగా విమర్శలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు.
2014 ఎన్నికల్లో పరాజయం పాలైన తరువాత అంబటి నియోజకవర్గానికి నాలుగేళ్ల పాటు దూరంగా ఉన్నారనీ, సంవత్సరం నుండే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి వచ్చారని చెబుతున్నారు.
జనసేన అభ్యర్థి యర్రాం వెంకటేశ్వరరెడ్డి విషయానికి వస్తే ఆయన నియోజకవర్గం నుండి 2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయంగా సాధించారు. కాంట్రాక్టర్గా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా యర్రాం వెంకటేశ్వరరెడ్డికి మంచి పేరు ఉండటంతో జనసేన పార్టీ ఆయన్ను ఆహ్వానించింది. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ద్వారా జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఎన్నికలకు ముందు కలవడంతో వెంటనే అభ్యర్థిత్వం ఖరారు చేసి బి ఫారం ఇచ్చారు.
ప్రధానంగా ఈ నియోజకవర్గంలో అభ్యర్థుల విజయావకాశాలకు కాపు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కీలకమని పేర్కొంటుంటారు. 2009 ఎన్నికల్లో పిఆర్పి అభ్యర్థిగా పోటీ చేసిన బూర దిలీప్ చక్రవర్తికి 25వేలకుపైగా ఓట్లు రావడంతో నాడు కాంగ్రెస్ అభ్యర్థిగా యర్రాం వెంకటేశ్వరరెడ్డి నాటి టిడిపి అభ్యర్థి నిమ్మకాయల రాజనారాయణపై కేవలం 7,147ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
వీరు ముగ్గురూ నియోజకవర్గంలో వారి వారి పార్టీల ఎజండా, మానిఫెస్టోలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి ప్రచారాలను నిర్వహించారు. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముక్కోణపు పోటీల్లో ఎవరు విజయం సాధిస్తారు అని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
గత 2014 ఎన్నికల్లో 84.27శాతం పోలింగ్ నమోదు కాగా ఈ సారి అత్యధికంగా 87.77శాతం పోలింగ్ జరిగింది. ఫలితాల వెల్లడికి మరో రెండు వారాలు ఉండటంతో గ్రామాల్లో పోలింగ్ సరళిని బట్టి ఎవరికి వారు కాకిలెక్కలు వేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు ఓటములపై భారీ స్థాయిలోనే బెట్టింగ్లు సాగుతున్నట్లు వినవస్తుంది. ఓటర్లు ఎవరిని గెలిపించారో తెలుసుకోవాలంటే ఈ నెల 23వరకూ వేచి చూడాలి.