అమరావతి: మొన్నటి ఎన్నికలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో పాటు మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా టిడిపి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా వోటు వేశారు. వివిధ శాఖల ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్లో అత్యధిక శాతం వైసిపికే పడ్డాయి. దీన్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగులు గత ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో స్పష్టమయింది.
ఈ నేపథ్యంలో పరిపాలనలో తనదైన మార్కు చూపించాలని భావిస్తున్న కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజలతో పాటు ఉద్యోగ వర్గాల్లోనూ చిరస్థాయిగా నిలిచిపోవాలన్న లక్ష్యంతో కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా ప్రభుత్వ ఉద్యోగుల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యంతో జగన్మోహనరెడ్డి చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే ఉదయం 10.30గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకు పని గంటలని స్పష్టీకరణ చేసినట్లు తెలుస్తోంది. పనిగంటలు అయిపోయిన తరువాత ఉద్యోగులు అదనపు గంటలు పని చేయాల్సిన అవసరం లేదు. విధి నిర్వహణ సమయంలో ఫైల్స్ ఆలస్యం కాకుండా ఖచ్ఛితంగా పని చేయాలనీ, ఫైల్స్ క్లీయరెన్స్లో అనవసరమైన కొర్రీలు వేయవద్దని సూచించినట్లు సమాచారం.
ముందుగా సచివాలయం పని విధానం మరింత సరళీకృతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల పేరుతో ఉద్యోగ విరమణకు దగ్గరున్న ఉద్యోగులను వేధించకుండా తీసుకోవాల్సిన చర్యలకు ప్రణాళికలు, తదితర అంశాలపై ఉద్యోగుల నుండి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు సిఎస్ ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలో అమలు అయ్యే విధానాలే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు అయ్యేలా చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో అధికారులను వీడియో, టెలీ కాన్ఫరెన్స్ సమీక్షల పేరుతో వేధించుకు తిన్నారనే ప్రచారం ఉంది.
ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ ఉద్యోగులపై పని భారం లేకుండా చర్యలు తీసుకోవాలన్న యోచనలో జగన్మోహనరెడ్డి ఉన్నట్లు సమాచారం.