గుర్ గ్రామ్ ప్రాంతంలో ఒక ముస్లిం యువకుడిని కొట్టి, బలవంతంగా ‘జై శ్రీరాం’ అనిపించిన ఘటనను ఖండించినందుకు, అధికారులు తక్షణం స్పందించాలని కోరినందుకు బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. అయినా తాను తనలాగే జీవిస్తానని, విమర్శలు.. ట్రోలింగులు పెద్ద సమస్య కానే కాదని గంభీర్ అన్నారు. అబద్ధాల వెనక దాక్కోవడం కంటే నిజం చెప్పడమే సులభమని ఆయన తెలిపారు. గుర్ గ్రామ్ ఘటనపై స్పందించిన గంభీర్.. ఆ విషయమై ట్వీట్ చేశారు. ‘‘గురుగ్రామ్ లో ముస్లిం యువకుడిని టోపీ తీయాలని, జై శ్రీరాం అనాలని బలవంతం చేశారు. ఇది శోచనీయం. గురుగ్రామ్ అధికారులు తక్షణం దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మనది లౌకిక దేశం. ఇక్కడ జావేద్ అఖ్తర్ ‘ఓ పలన్ హరే, నిర్గుణ్ ఔర్ న్యారే’ అని రాస్తే.. ఓం ప్రకాష్ మెహ్రా ‘అర్జియా’ అంటూ రాశారు’’ అని ఆయన చెప్పారు.
దీనికి ఏకంగా 4500 కామెంట్లు వచ్చాయి. అందులో చాలామంది కేవలం మైనారిటీ వ్యక్తిమీద దాడికే ఎందుకు స్పందించావని అడిగారు. దాంతో తన మొదటి ట్వీట్ చేసిన మూడు గంటల తర్వాత గంభీర్ మరో ట్వీట్ చేశారు. ‘‘లౌకికవాదంపై నా ఆలోచనలన్నీ గౌరవ ప్రధాని నరేంద్రమోదీ మంత్రమైన ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ నుంచే వచ్చాయి. నేను కేవలం గురుగ్రామ్ ఘటనకే పరిమితం కాబోను. కుల మతాల ఆధారంగా జరిగే ఏ అణచివేత అయినా శోచనీయమే. సహనం, సమ్మిళిత వృద్ధి అనే ఆలోచనల మీదే భారతదేశం ఉంది’’ అని తెలిపారు.
తాను ఇంతకుముందు క్రికెటర్ ని కావడంతో విమర్శలు తనకు కొత్త కావని అన్నారు. అవి తనకు సహజమేనని, అందువల్ల ట్రోల్స్ పెద్ద సమస్య కాదని చెప్పారు. తానెప్పుడూ బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటాను తప్ప గ్రే కలర్ నచ్చదని అన్నారు. ఎవరైనా తాము సురక్షితంగా ఉన్నట్లు భావించకపోతే వారి నమ్మకాన్ని ఎలా పొందగలమని ప్రశ్నించారు. కేవలం తమ మతాన్ని పాటించినందుకు అలా చేస్తే ఎలాగన్నారు. అయితే, గంభీర్ వ్యాఖ్యలు ఢిల్లీలోని కొందరు పార్టీ పెద్దలకు అంతగా రుచించలేదని సీనియర్ నేతలు అన్నారు. కొన్ని నెలల్లోనే హర్యానాలో ఎన్నికలు ఉన్న తరుణంలో ఆయనిలా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు మొదలైంది కాబట్టి గంభీర్ స్పందించకుండా ఉండాల్సిందని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రతిపక్షానికి ప్రభుత్వంపై అస్త్రాలు దొరుకుతాయని అన్నారు.
అధికారికంగా బీజేపీ విభిన్నంగా స్పందించింది. పార్టీ అధికార ప్రతినిధి తాజిందర్ పాల్ సింగ్ బగ్గా దీనిపై ట్వీట్ చేశారు. ‘‘గురుగ్రామ్ లో జరిగిన అంతర్గత వివాదానికి మతపరమైన రంగు పూయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. హిందూ ముస్లింల మధ్య జరిగే ప్రతి గొడవకూ రాజకీయ కోణం ఇస్తే దేశాన్ని విడగొట్టడమే అవుతుంది. ముస్లిం పార్టీ వాళ్లు పోలీసులకు ఫోన్ చేసినప్పుడు కూడా దాన్ని హిందూ ముస్లింల గొడవగా చెప్పలేదు. తర్వాతే ఆ రంగు ఇచ్చారు’’ అన్నారు. తనకు ఈ విషయం గురించి తెలియదని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ తప్పుకొన్నారు. పోలీసులు దర్యాప్తు చేసి వాస్తవాలను కనుగొంటారని ఆయన తెలిపారు.