శాసనసభలో మంచి సంప్రదాాయాలను నెలకొల్పుతామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు
హైదరాబాద్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న సామెత లాగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయసంకల్పం పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కెసిఆర్కు ఇబ్బందికరంగా పరిణమించింది. గురువారం స్పీకర్ ఎన్నిక తర్వాత జగన్ శాసనసభలో మాట్లాడుతూ, తాను టిడిపిలాగా ఫిరాయింపులను ప్రొత్సహించనని స్పష్టం చేశారు.
పక్క రాష్ట్రమైన తెలంగాణలో దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఆరు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ సభ్యులలో 12 మంది టిఆర్ఎస్లో చేరారు. వారు మూడింట రెండు వంతులన్న మిషతో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి టిఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ విలీనం అయిపోయిందని ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ పోరాడుతున్నది, అటు ప్రజాక్షేత్రంలోనూ, ఇటు న్యాయస్థానాలలోనూ.
తెలంగాణలో ఉన్న పరిస్థితును బట్టి ఎపి ముఖ్యమంత్రి జగన్ సంకల్పం ప్రతిధ్వనులు వెంటనే వినబడ్డాయి. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి జగన్నూ, కెసిఆర్నూ పోల్చి చూస్తూ తెలంగాణ ముఖ్యమంత్రిని తీవ్రంగా విమర్శించారు. ఫిరాయిపుల వల్ల ప్రజాస్వామ్యం మనుగడ ప్రమాదంలో పడిందంటూ సిపిఐ నేతలు శుక్రవారం హైదరాబాద్లో అర్ధనగ్న నిరసనకు దిగారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ తన సహజ శైలిలో జగన్ను పొగుడుతూ, కెసిఆర్ను తెగిడారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విషయంలో మాట్లాడుతున్నవారంతా జగన్ను చూసి కెసిఆర్ సిగ్గు తెచ్చుకోవాలని అంటున్నారు. ఇది కెసిఆర్ను ఎంతైనా ఇబ్బంది పెట్టే విషయం. ఆయన సీనియర్ రాజకీయనాయకుడు. జగన్ నిన్నకాక మొన్న రాజకీయాలలోకి వచ్చిన వ్యక్తి. అలాంటి జగన్ను చూసి కెస్ఐర్ నేర్చుకోవాలని చెప్పడం తెలంగాణ ముఖ్యమంత్రికి తప్పనిసరిగా చిన్నతనమే.
పైగా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాధినేత చంద్రబాబుతో కయ్యానికి కాలు దువ్విన కెసిఐర్ అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ముఖ్యమంత్రితో చాలా సఖ్యతగా ఉంటున్నారు. ఇప్పుడు జగన్ను ఏమీ అనేందుకు లేదు. అలా అని వస్తున్న విమర్శలను ఉపేక్షించేందుకు లేదు. ఫిరాయింపులను ప్రోత్సహించడంపై వస్తున్న విమర్శలకు ప్రతిగా, కాంగ్రెస్ గతంలో టిఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చేసేందుకు చూడలేదా ఏమిటి అని ఆ పార్టీ నాయకత్వం ప్రశ్నిస్తున్నది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్, టిడిపి చేసిన తప్పే నేనూ చేస్తే ఇక మంచి అనేది ఎక్కడ ఉంటుంది అని అంటున్నారు. ఇది కెసిఆర్కు ఇబ్బంది కాక మరేమిటి?