న్యూస్ చానళ్ళకు టీఆర్పీలు ఎలా సాధ్యమవుతాయి? బేగంపేట పబ్ దగ్గర జరిగిన సంఘటనలో బాధితురాలిని గంటల తరబడి ఎన్టీవీ లైవ్ చేసినట్టు అని జవాబివ్వకండి! జూన్ 20, గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ఒకవైపు కాకినాడలో, మరోవైపు ఢిల్లీలో తెలుగుదేశం రాజకీయనాయకుల హడావుడి మొదలైంది. ఆ సమయంలో దాదాపు అన్ని చానళ్ళు స్పాన్సర్డ్ కార్యక్రమాల్లో మునిగివున్నారు. అవి వైద్యమో, కోచింగో, జ్యోతిష్యమో, వస్తువుల అమ్మకాలో… ఇలా అన్నమాట. ఎన్టీవి, సాక్షి, ఏబిఎన్, టీవీ-5 – దాదాపు ఎనిమిది తొమ్మిది పైగా న్యూస్ చానళ్ళు ఈ తరహా కార్యాక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. ఒకే ఒక టీవీ-9లో మాత్రం వార్తల బులెటిన్లో ఉంది. రాజ్యసభ సభ్యులు ముగ్గురు, నలుగురు పార్టీ వదులుతారా అని ఢిల్లీ నుంచి; ఓడిపోయిన కాకినాడ ప్రాంత నాయకుల భవిష్యత్ కార్యక్రమ ప్రణాళిక అంటూ కాకినాడ నుంచి వార్తలు కేవలం టీవీ 9 మాత్రమే ఇవ్వగలిగింది. మిగతా చానళ్ళకు ఇవి ముఖ్యమే కానీ ప్రారంభించిన కార్యక్రమం ఆపడం సాధ్యంకాదు గదా! ఈ సందర్భంలో మాత్రం కాకతాళీయంగా టీవీ-9 స్కోర్ చేసింది.
సిన్మా ఆడియో రిలీజు వేళ ఇటువంటిది ఎన్టీవీలోనో, టీవీ-9లోనో జరుగుతుంది. ఆ సమయంలో వారు ఎంత ముఖ్యమైన వార్తలు వచ్చినా, అవి కాకుండా తాము ఇవ్వాలనుకున్న కార్యక్రమం ప్రసారం చేస్తారు. ఇలా గమనించినపుడు ఎన్నికల సమయంలో ఈ డాక్టర్లు, కాలేజీ వాళ్ళు, స్వామీజీలు ఎందుకు సెలవు తీసుకుని పార్టీల ప్రచారానికి అవకాశం కల్గించారు అనే ప్రశ్న వస్తుంది. ప్రణాళిక ముందే ఉంటుంది కనుక లాభించి స్పాన్సర్డ్ కార్యక్రమాలు సైతం రద్దు చేసి పార్టీల ప్రచార కార్యక్రమాలు ఇస్తున్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రారంభోత్సవ సమయంలో సైతం చాలా చానళ్ళు చాలా కార్యక్రమాలు ఇచ్చి హడావుడి పెంచాయి.
తెలుగుదేశం ఎంపీలు పార్టీ వీడటం; బీజేపీలో చేరడం వంటి సంఘటనలు; జగన్మోహనరెడ్డి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వంటి సందర్భాలలో టీవీ చానళ్ళలో చర్చలు ఆసక్తికరంగానే కాదు, చాలా సమయాలలో శిరోభారంగా మారుతున్నాయి. ఎన్టీవి, ఏపి 24 x 7 చానళ్ళు ఎక్కువమంది పానలిస్టులతో చర్చలు నిర్వహించడం బావుంటుంది. అయితే ఇటీవల తెలుగుదేశం, వైకాపా పార్టీ ప్రతినిధులు ఎక్కువ స్థాయిలో కేకలు వేసుకుంటున్నారు.
ఇలాంటి చర్చల సమయాల్లో యాంకర్లు మాటిమాటికి అడ్డుతగలడం పరిపాటి. ఒక్కసారి అసలు విషయం బోధపడక చక్కని విషయాలు చెప్పేవారికి అభ్యంతరం చెప్పి, చెప్పలేని వారిని దువ్వుతూ ఉంటారు. ఇటీవల తమిళ దర్శకుడు భారతీరాజా మద్రాసు తెలుగు సినీరంగపు వ్యక్తులపై నోరు పారేసుకున్నారు. నిజానికి ఇలాంటి విషయాలు మన చానళ్ళ దృష్టికి రావు. సినిమా విషయం కనుక టీవీ-5లో ఒక చర్చ చేశారు. విషయం మీద పూర్తి అవగాహన లేని మూర్తి అర్ధాంతరంగా చర్చలో అడ్డుతగిలి రసాభాస చేశారు.
టీవీ-9 మాజీ సీఈవో రవిప్రకాష్ వ్యవహారం ఇంకా తేలలేదు. హైకోర్టు పరిథిలో ఉంది. టీవీ-9కు స్ఫూర్తి అయిన ఎన్డి టీవీ ప్రణయ్రాయ్ ఇటీవల వార్తలకెక్కారు. 2008లో ఎన్డి టీవీలో 6.4 శాతం ఇండియన్ బుల్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్కు అమ్మారట. ఆరునెలల తర్వాత ఈ సంస్థ మరో 20.28 శాతం షేర్లు ఓపెన్ మార్కెట్లో కొన్నది. అయితే ఈ వ్యవహారాలు ‘సెబి’కి తెలపలేదని అభ్యంతరం వ్యక్తమయ్యింది. 12 లక్షలు జరిమానా విధించింది. అంతకు ముందు వారం మరో విషయం బయటకు వచ్చింది. ప్రణయరాయ్ దంపతులు ఒక రెండేళ్ళపాటు చానల్ బోర్డు కార్యకలాపాలలో పాల్గొనకూడదని సెబీ ప్రకటించింది. యాజమాన్యస్థాయికి ఎగబ్రాకిన జర్నలిస్టుల నైతిక వర్తనలోను, సంస్థల విధివిధానాలు పాటించడంలోను ఇటువంటి లొసుగులు తరచు వార్తలవుతున్నాయి. దీనివల్ల యాజమాన్యాలను తప్పుపట్టే నైతిక అధికారం జర్నలిస్టులు కోల్పోతున్నారు.
దూరదర్శన్ కాశ్మీర్ చానల్ ఆవిష్కరణ, తోగ్రీభాషలో న్యూస్బులిటిన్ ప్రారంభోత్సవం జూన్ 21న జరిగాయి. ఈ సమయంలో కేంద్రసమాచార ప్రసారశాఖామాత్యులు ప్రకాష్ జవదేకర్ ఇచ్చిన గణాంకాలు ఆసక్తిగా ఉన్నాయి.
* మనదేశంలో 25 కోట్ల కుటుంబాలుండగా, ఇప్పటికే 18 కోట్ల కుటుంబాలలో టీవీ సెట్లు ఉన్నాయి.
* దేశవ్యాప్తంగా ప్రస్తుతం 700 టీవీ చానళ్ళు వున్నాయి.
* దేశంలో 9 కోట్ల కుటుంబాలకు కేబుల్ టీవీ ప్రసారాలు అందుతున్నాయి.
* దేశంలో ప్రధాన కేబుల్ ఆపరేటర్లు ఐదారుమంది మాత్రమే ఉన్నారు.
* దూరదర్శన్కు నేడు మూడున్నర కోట్ల డిటిహెచ్ కనక్షన్లు ఉన్నాయి.
– డా. నాగసూరి వేణుగోపాల్