రాజమండ్రి: ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు చేసే ఆందోళనలకు అధికార పక్షం వివరణలు ఇవ్వాలే తప్ప వారిపై విరుచుకుపడి వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని సీనియర్ నేత, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇసుక, ఇంగ్లీష్ అంశాలపై చంద్రబాబు, పవన్లు ప్రతిపక్షాలుగా వారి పాత్ర వాళ్లు పోషిస్తున్నారని అన్నారు. 151 సీట్లు ఉన్న అధికార వైసిపికి వారు లేవనెత్తిన సమస్యపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
పవన్ కళ్యాణ్పై జగన్మోహనరెడ్డి, ఆయన్ను పవన్ కళ్యాణ్ విమర్శించడాన్ని ఉండవల్లి తప్పుబట్టారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఇంగ్లీష్పై శిక్షణ ఇవ్వడంతో పాటు పాఠశాలలో ఇంగ్లీష్ తప్పనిసరి చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రుల స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలని ఉండల్లి సూచించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలో కూడా తెలుగు తప్పనిసరి అని నిబంధన పెట్టాలని ఆయన అన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వైసిపి ఎంపిలు విభజన జరిగిన తీరుపై చర్చకు నోటీసులు ఇవ్వాలని ఉండవల్లి అన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడుగతూనే ఉంటామని సిఎం జగన్ గతంలో అన్నారనీ, కేంద్రాన్ని ఎంత కాలం అడుగుతూ ఉన్నా ప్రత్యేక హోదా ఇవ్వరని ఉండవల్లి తేల్చి చెప్పారు.