విజయవాడ: సీఎం జగన్కు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ మున్సిపల్ మంత్రి బొత్స తన నత్తి మాటలతో రాజధాని రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం నుంచి ప్రెస్ మీట్లు మొదలుపెట్టి ఆదివారం నాటికి ఉత్తరాంధ్ర వెళ్లిపోతారని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమను గెలిపించిన రైతులనే పెయిడ్ ఆర్టిస్టులని హేళనగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటేసినందుకు సిగ్గుపడుతున్నామని, వైసీపీ కార్యకర్తలే టీడీపీ అధినేత చంద్రబాబు ఎదుట వాపోయారని చెప్పారు.
రాజధాని రాకుండా ఆళ్ల ఎన్ని కేసులు వేశారో అందరికీ తెలుసన్నారు. ఆళ్ల రామకృష్ణరెడ్డి 2014నుంచి 2019 వరకు ప్రజలను పట్టించుకోకుండా 365 రోజుల సరిపడా 365కేసులు వేశారు విమర్శించారు. ఏడు గ్రామాల వాళ్లు వచ్చి ధర్నా చేస్తే స్పందించాలా అంటూ మంత్రి ధర్మాన కృష్ణప్రసాద్ హేళన చేశారని అనురాధ దుయ్యబట్టారు. దళితులకు ఎమ్మెల్యే సీటు రాకుండా చేసిన శ్రీదేవి.. రైతుల గురించి మాట్లాడుతారా ? అని మండిపడ్డారు. శ్రీదేవి ఎస్సీ ఎమ్మెల్యేనా ? కాదా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని విమర్శించారు. కలెక్టర్ స్వయంగా పిలిచి ఆమె గెలుపుపై వివరణ కోరారని గుర్తు చేశారు. తమను గెలిపించిన రైతులనే పెయిడ్ ఆర్టిస్టులంటూ అపహాస్యం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్రెడ్డి సెక్రటేరియట్కు వెళ్లాడానికి కాన్వాయ్ని ట్రైల్రన్ వేసిన పరిస్థితి అందరికి తెలుసన్నారు. నక్సల్స్ ప్రాంతంలో ట్రెల్రన్ వేస్తారని, కానీ రైతుల నుంచి వెళ్లడానికి ట్రైల్రన్ వేయించుకున్న ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్రెడ్డి మాత్రమేని ఎద్దేవా చేశారు. ఏపీ నుంచి లులూ ఎందుకు వెళ్లిపోయిందో చెప్పాలని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.