మంగళగిరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం అమరావతిలో పర్యటించనున్నారు. మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు పవన్ కల్యాణ్ సంఘీభావం తెలపనున్నారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అమరావతిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పవన్కు 20 పేజీల నివేదిక అందజేశారు. ఈ నివేదికపై పార్టీ నేతలతో పవన్ చర్చించారు. అనంతరం మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచే పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల రైతులతో ఆయన మాట్లాడతారు. అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలని పవన్కల్యాణ్ ఆకాంక్షించారు. ఒకరికి న్యాయం చేసి, ఇంకొకరికి అన్యాయం జరగాలని ఎవరూ కోరుకోకూడదన్నారు. మూడు రాజధానుల అంశంపై జరుగుతున్న చర్చ అందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం కొన్ని ఇబ్బందికర పరిస్థితులున్నాయని, ఇలాంటి సమయంలో అందరం ఒక అవగాహనకు రావాలని అభిప్రాయపడ్డారు. జిల్లాలవారీగా ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పాలని పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చారు. కాగా, ఇటీవల మందడంలో జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబుతో పాటు పలువురు పర్యటించిన విషయం తెలిసిందే.