తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి అప్పగించనున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రకటనను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. రేవంత్ కు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేయడానికి వి హనుమంత రావు, జగ్గారెడ్డి లాంటి నేతలు వెనుకడుగు వేయలేదు.
కొద్ది రోజుల క్రితం గాంధీభవన్ లో రేవంత్ వ్యతిరేక వర్గం సమావేశమై.. రేవంత్కు తప్ప ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తామనే సంకేతాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం..కాంగ్రెస్ హైకమాండ్ అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేకపోడంతో వారు మిన్నకుండి పోయారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ కు ప్రధాన పోటీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి మధ్యనే ఉండటంతో పార్టీ హైకమాండ్ వారితో మంతనాలు జరిపి చివరకు రేవంత్ రెడ్డి వైపు మొగ్గిందని చెబుతున్నారు. తమరిద్దరిలో ఎవరికి ఇచ్చినా కలసి పనిచేస్తామని వారు హైకమాండ్ వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించే ముందు రేవంత్ ను ఒక సారి ఢిల్లీకి పిలిపించి మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ వ్యతిరేక వర్గం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.