కూటమి కట్టారు. వైసీపీపై తిరుగు బావుటా ఎగురవేయాలని నిర్ణయించారు. సుమారు ఆరు మాసాలు కేం ద్రాన్ని ఒప్పించేందుకు నడుంబిగించారు. కలసి కట్టుగా యుద్ధం చేసి..జగన్ను ఇంటికో.. కుదిరితే జైలు కో పంపించాలని భావించారు. కష్టమే అయినా.. ఇష్టంగానే చేతులు కలిపారు. కానీ, తీరా ఎన్నికల సమయానికి.. మరో నెల రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయనగా.. ఇప్పుడు మార్పులు చేపడుతున్నారు. దీంతో కూటమి సక్సెస్పై ఇప్పుడు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఏపీ లక్ష్యంగా పిలుపునిచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీని ఒప్పించి.. టీడీపీ, జనసేనలు ఆ పార్టీతో చేతులు కలిపేలా ముందుకు సాగారు. ఇక, ఈ కూటమి కూడా ఏర్పడింది. దాదాపు నెల రోజులు దాటి పోయింది. ఇక, సీట్లు కూడా పంచేసుకున్నారు. టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి రెడీ అయింది. అభ్యర్థులను కూడా ఖరారు చేసుకున్నారు. మరో నెల రోజుల్లో (38 రోజుల్లో) ఎన్నికలు కూడా జరగనున్నాయి.
ఇలాంటికీలకమైన సమయంలో దాదాపు 10 నుంచి 20 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేందుకు ప్ర యత్నాలు సాగుతున్నాయి. వీటిలో కూటమిగా పంచుకున్న నియోజకవర్గాలు.. అదే సమయంలో అభ్యర్థ లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నియోజకవర్గాల్లోనూ మార్పులు తథ్యమని తెలుస్తోంది. అయితే.. మార్పు ఎలాంటిదైనా.. కూడా ఇది అంతిమంగా.. పార్టీలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు పొత్తు పార్టీల నాయకులు ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించింది లేదు.
ఎక్కడ చూసినా.. అధినేతలు మాత్రమే పొత్తుల గురించి మాట్లాడుతున్నారు తప్ప.. క్షేత్రస్థాయిలో నాయ కులు మాత్రం ఈ పొత్తులపై స్పందించడం లేదు. అంతేకాదు.. జెండాలు కూడా కలిసి కట్టుగా ముందుకు సాగడం లేదు. ఇది ఒక సమస్య అయితే.. ఇప్పుడు అభ్యర్థులను మారిస్తే.. మరింతగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీల పరిస్థితి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. అసమ్మతి ఉన్నా సర్దుకు పోతున్నారు. ఇలాంటి సమయంలో మార్పులు చేపడితే.. వారు హర్టయి.. మొదటికే సీన్ మారిపోయినా.. ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు. దీనిని కూటమి పార్టీలు ఎలా ఎదుర్కొంటాయనేది ప్రధాన ప్రశ్న.